ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీధి కుక్కలకు బహిరంగంగా ఆహారం పెట్టొద్దు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

national |  Suryaa Desk  | Published : Fri, Aug 22, 2025, 08:30 PM

దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల సమస్యకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తాజాగా సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలను సవరించింది. బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, వీధుల్లో శునకాలను ఆహారం ఇవ్వడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. నిర్దేశిత ప్రాంతాల్లోనే వాటికి ఆహారం అందివ్వాలని సూచించింది. ఇందుకోసం ప్రతి వార్డులో ప్రత్యేక కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేయాలని ఆదేశించింది. ఆ కేంద్రాల్లో మాత్రమే వీధి కుక్కలకు ఆహారం అందివ్వాలని సూచిస్తూ నోటీసు బోర్డులను ఏర్పాటుచేయాలని తెలిపింది.


ఎట్టి పరిస్థితుల్లోనూ కుక్కులను వీధుల్లో ఆహారం ఇవ్వకూడదని తేల్చిచెప్పింది. దీనికి విరుద్దంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎక్కడబడితే అక్కడ వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడం వల్ల అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయనే నివేదికలను పరిగణనలోకి తీసుకొని ఈ ఆదేశాలు వెలువరించినట్టు చెప్పింది. వీధుల్లో నడిచే సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి చర్యలకు స్వస్తి పలకాలని అభిప్రాయపడింది.


ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతం నుంచి వీధి శునకాలను షెల్టర్లకు తరలించాలంటూ ఆగస్టు 11న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. కుక్కల దాడులు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తంచేసిన సుప్రీంకోర్టు.. అవి బయట రోడ్లపై కనిపించడానికి వీల్లేదని, షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు, నిరసనలు, అభ్యంతరాలు రావడంతో జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ ఎన్వీ అంజరియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.


ఈ క్రమంలో టీకాలు వేసిన తర్వాతే వీధి కుక్కలను వదిలిపెట్టాలని సూచించింది. అయితే, రేబిస్‌ లక్షణాలు, విపరీత ప్రవర్తన కలిగినవాటిని మాత్రం షెల్టర్లలోనే ఉంచాలని ఆదేశించింది. మిగతావాటికి టీకాలు, స్టెరిలైజేషన్‌ చేసిన తర్వాత ఎక్కడ నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేయాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు.. దీనికి సంబంధించి గత విచారణలో (ఆగస్టు 11న )ఇచ్చిన ఆదేశాలను సవరించింది. అనంతర తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. ఇక, వీధి కుక్కల దాడుల్లో చాలా మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ రెండేళ్ల బాలుడికి గాయం కాగా.. దానిని వీధి కుక్క నాకడంతో అతడికి రేబిస్ సోకింది. పరిస్థితి విషమించి ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాలుడు ఆడుకుంటుండగా నెల రోజుల కిందట కేవలం నాకిందని, కరవలేదని కుటుంబసభ్యులు చెప్పారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa