ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షేక్ హ్యాండ్‌ వివాదంలో ఐసీసీ వద్ద పాక్‌కు భంగపాటు

sports |  Suryaa Desk  | Published : Tue, Sep 16, 2025, 10:14 PM

ఆసియాకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్‌ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ సమయంలో భారత కెప్టెన్, మ్యాచ్ తర్వాత టీమిండియా ఆటగాళ్లెవరూ పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన ఆరోపణలు చేసింది. ఈ మ్యాచ్‌కు రిఫరీగా ఉన్న ఆండీ పైక్రాఫ్ట్‌ నిబంధనల ఉల్లంఘనలకు కారణమయ్యారంటూ ఆరోపించింది. ఆయనను తొలగించాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ).. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసింది.


తమ డిమాండ్‌ను నెరవేర్చని పక్షంలో ఆసియాకప్‌లో మిగతా మ్యాచ్‌లను బహిష్కరిస్తామని పీసీబీ హెచ్చరించినట్లు సైతం వార్తలు వచ్చాయి. అయితే పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపడమే తమ ఉద్దేశమని, షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ సమర్థించుకున్నాడు. కాగా మ్యాచ్ రిఫరీని తొలగించాలనే డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయంలో పాకిస్థాన్ వెనక్కితగ్గినట్లు సమాచారం.


“మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌.. ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడంపై ఐసీసీకి పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు ఫిర్యాదు చేసింది. ఆసియాకప్‌లో మ్యాచ్‌ రిఫరీగా ఉన్న పైక్రాఫ్ట్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశాం” అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఏసీసీ చీఫ్ మోహిసన్ నఖ్వీ ఓ ప్రకటనలో చెప్పారు. ఇక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సైతం.. టాస్‌ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్ యాదవ్‌తో షేక్ హ్యాండ్‌ చేయొద్దని పాకిస్థాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ అలీ అఘాకి రిఫరీ పైక్రాఫ్ట్‌ చెప్పాడని ఆరోపించింది.


అయితే మ్యాచ్ రిఫరీ తొలగింపు విషయంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చేసిన ఫిర్యాదును ఐసీసీ పెద్దగా పట్టించుకోలేదు. మ్యాచ్‌ రిఫరీపై చర్యలకు ఐసీసీ ఒప్పుకోలేదు. దీంతో పీసీబీ డిమాండ్‌ తిరస్కరించినట్లయింది. అయితే తమ డిమాండ్ నెరవేర్చకపోతే టోర్నీని బహిష్కరిస్తామని పీసీబీ హెచ్చరించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన మాత్రం లేదు. ఈ పరిస్థితుల్లో వివాదాన్ని ఇంతటితో ముగించడం తప్ప పాక్‌కు మరో ఆప్షన్ లేదు. ఒకవేళ యూఏఈతో మ్యాచ్‌ను ఆ జట్టు బహిష్కరిస్తే.. టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో బుధవారం పాకిస్థాన్, యూఏఈ మధ్య మ్యాచ్ యథావిథిగా జరిగే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa