ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీరు కివి పండు తింటే కచ్చితంగా ప్రమాదంలో పడట్లే

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Nov 05, 2025, 11:18 PM

కివి పండు ఈ రోజుల్లో మార్కెట్లలో ఎక్కువగా లభిస్తుంది. చాలా మంది ఈ పండును ఇష్టంగా తింటున్నారు. ఖరీదు ఎక్కువైనప్పటికీ.. ఆరోగ్యానికి మంచిదని చాలా మంది దీన్ని కొనడానికి కూడా వెనుకాడటం లేదు. ఇక, కివి పండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కివి పండు తినడానికి ఎంతో రుచిగా కూడా ఉంటుంది.


​కివి పండులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. కివి పండు తినడం వల్ల శారీరక ఆరోగ్యం నుంచి మెదడు, గుండె, చర్మం, జుట్టు వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కివి పండు అందరికీ ప్రయోజనకరంగా ఉందా? అంటే కాదంటున్నారు నిపుణులు. కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కివి పండుకి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కివి పండు ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.


అలెర్జీలు ఉన్నవారు


రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి.. అలెర్జీ సమస్యలతో బాధపడేవారికి కివి పండు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. పబ్‌మెడ్ సెంట్రల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం కివిలో ప్రధాన అలెర్జీ ప్రోటీన్ యాక్టినిడిన్ ఉంటుంది. ఆక్టినిడిన్‌కి గురికావడం వల్ల అలెర్జీ ఉన్నవారికి తేలికపాటి దురద, నోటి వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి పరిస్థితులు తలెత్తవచ్చు. అందుకే అలెర్జీ సమస్యలతో బాధపడేవారు కివి పండుకి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


కిడ్నీలో రాళ్ల సమస్య


కిడ్నీ సమస్యలు లేదా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు ఈ పండును తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో ఆక్సలేట్ ఉంటుంది. ఇది మూత్రపిండాల వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుంది. కివిలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇది మూత్రపిండాల సమస్యల్ని మరింత పెంచుతుంది. కిడ్నీల్లో రాళ్లు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఈ సమస్య ఉన్నవారు దూరంగా ఉండటమే మేలు.


జీర్ణ సమస్యలు


కివీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగు కదలికల్ని నియంత్రించడంలో సాయపడుతుంది. అయితే, ఎక్కువగా తినడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. గ్యాస్, ఉబ్బరం లేదా విరేచనాలు వంటి సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు, ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్‌తో బాధపడేవారికి కివి పండు అస్సలు పడదు. ఇలాంటి వారు తినడం వల్ల కడుపులో చికాకుతో పాటు మరికొన్ని సమస్యలు తలెత్తవచ్చు.


మందులు వేసుకునేవారు


కివీలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది కొన్ని మందులతో సంకర్షణ చెందుతుంది. బీటా-బ్లాకర్స్, ACE ఇన్హిబిటర్లు లేదా పొటాషియం-స్పేరింగ్ డైయూరిటిక్స్ తీసుకునే వ్యక్తులు కివి తినే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.


అధిక పొటాషియం హైపర్‌కలేమియా ప్రమాదాన్ని పెంచుతుంది. కివీలో రక్తాన్ని కొద్దిగా పలుచబరిచే సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఈ కారణంగా యాంటీకోగ్యులెంట్స్ లేదా వార్ఫరిన్ వంటి రక్తాన్ని పలుచబరిచే మందులు తీసుకునే వ్యక్తులు కివీని తినేముందు వైద్యుణ్ని సంప్రదించాలి.


వీళ్లు కూడా జాగ్రత్త


* శస్త్రచికిత్స చేయించుకున్నవారు లేదా చేయించుకోబోయే వారు కివి పండు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శస్త్రచికిత్స సమయంలో లేదా తర్వాత రక్తస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల షెడ్యూల్ చేసిన శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల ముందు కివిఫ్రూట్ తినడం మానేయాలని సిఫార్స్ చేస్తున్నారు ఎక్స్‌పర్ట్స్.


* గర్భిణీలు లేదా పాలిచ్చే తల్లులు వైద్యుల సలహా మేరకు మాత్రమే కివి పండు తినాలి. దీనిని తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి లేదా పూర్తిగా నివారించడం మంచిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa