సమాజంలో రోజురోజుకూ దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఒక్క క్షణం ఆదమరిచినా.. డబ్బు గోవిందా.. ముఖ్యంగా బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద నగదు విత్ డ్రా చేసిన తర్వాత అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. లేకుంటే.. మన డబ్బును మనకు తెలియకుండానే మాయం చేసే కేటుగాళ్లు తయారయ్యారు. అలాంటి ఘటనే పశ్చిమ గోదావరి జిల్లా లో చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఓ వ్యక్తి బైక్లో ఉంచిన రెండు లక్షల రూపాయలను చోరీ చేశారు. కళ్లు మూసి తెరిచేలోగా దొంగ తన పని చక్కబెట్టుకున్నారు. బ్యాంకులో విత్ డ్రా చేసిన డబ్బును ఓ వ్యక్తి బైక్ కవర్ లో పెట్టి తీసుకెళుతున్న సమయంలో ఈ చోరీ జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం వేములదీవికి చెందిన ఉంగరాల శ్రీను అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఓ బ్యాంకులో నగదు డ్రా చేశాడు. ఏవో అవసరాల నిమిత్తం రూ.2 లక్షలు డ్రా చేసిన శ్రీను.. ఆ డబ్బును బైక్ కవరులో దాచి ఇంటికి బయల్దేరాడు. అయితే మార్గమధ్యలో ఆకలి కావటంతో ఓ హోటల్ ముందు బండి నిలిపాడు. టిఫిన్ చేసేందుకు బైక్ను రోడ్డు పక్కన ఆపి.. హోటల్లోకి వెళ్లాడు. టిఫిన్ చేసి తిరిగొచ్చేసరికి తన బైక్ కవర్లో దాచిన 2 లక్షలు ఉంగరాల శ్రీనుకు కనిపించలేదు. తొలుత ఆందోళన చెందిన శ్రీను.. తర్వాత హోటల్ ముందు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఈ పుటేజీలో ఓ యువకుడు బైక్ కవర్లో దాచిన డబ్బు తీసుకెళ్లడం రికార్డైంది. దీంతో తన డబ్బును దొంగతనం చేశారంటూ ఉంగరాల శ్రీను పోలీసులను ఆశ్రయించారు.
మరోవైపు శ్రీను ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. శ్రీను బ్యాంక్ వద్ద డబ్బు డ్రా చేసిన విషయం ఆ దొంగ గమనించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంక్ వద్ద నుంచి వెనుక ఫాలో అయి ఉంటాడని భావిస్తున్నారు. హోటల్ వద్ద సందు దొరకగానే బైక్ కవర్లోని డబ్బులను కాజేసీ పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసినప్పుడు, పెద్ద మొత్తంలో డబ్బును తీసుకెళ్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చోరీ చేసిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa