సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్ర ముగించుకుని మదీనాకు తిరిగి వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో హైదరాబాద్ విద్యానగర్కు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి షేక్ నసీరుద్దీన్ కుటుంబానికి ఊహించని విషాదం వాటిల్లింది. ఒకే కుటుంబానికి చెందిన 18 మంది సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 45 మంది మృతి చెందిన ఈ ప్రమాదంలో ఎక్కువమంది హైదరాబాద్ వాసులే ఉన్నారు. బస్సు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైన దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. ఈ ఘటన హైదరాబాద్ నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
నసీరుద్దీన్ (65) భార్య అక్తర్ బేగం (60), చిన్న కుమారుడు సలావుద్దీన్, కోడలు, ముగ్గురు కుమార్తెలు, వారి భర్తలు మరియు పిల్లలతో కలిపి మొత్తం 18 మంది ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఈ నెల 9న హైదరాబాద్ నుంచి బయలుదేరిన వీరు మక్కా యాత్ర పూర్తి చేసుకుని మదీనాకు వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. మృతుల్లో 8 మంది పెద్దలు, 10 మంది పిల్లలు ఉన్నారు. ఒక్కసారిగా మూడు తరాలు అంతరించిపోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రమాదం జరిగిన బస్సులో 46 మంది ప్రయాణికులు ఉండగా, ఒకరు మినహా అందరూ మరణించారు.
కుటుంబంలో మిగిలిన ఏకైక వ్యక్తి పెద్ద కుమారుడు సిరాజుద్దీన్. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అతడు ఈ యాత్రలో పాల్గొనలేదు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. విద్యానగర్లోని నసీరుద్దీన్ ఇంటి వద్ద బంధువులు, పొరుగువారు తండోపతండాలుగా చేరి ఏడుస్తున్నారు. మృతదేహాలు తీవ్రంగా కాలిపోవడంతో గుర్తింపు కష్టంగా మారింది. చివరి చూపులకు కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడటంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు.
నసీరుద్దీన్ తల్లి రోషన్ బేగం గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. "అల్లా ఎంత పని చేశాడు.. ఒక్కసారిగా అందరినీ తీసుకెళ్లాడు" అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరిసారి కూడా ముఖం చూడలేని దుస్థితి ఆమెను మరింత బాధిస్తోంది. బంధువులు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నా, ఆమె ఏడ్చి ఏడ్చి అలసిపోతున్నారు. ఈ విషాదం హైదరాబాద్ నగరమంతా శోక మయమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa