ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత నౌకాదళ డేటాను అమ్మేసిన ఇద్దరి అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 08:02 PM

దేశ జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెట్టిన భారీ గూఢచర్యం ఘటనలో ఉడుపి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. భారత నౌకాదళానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని వీరు దాయాది దేశం పాకిస్థాన్‌కు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే అరెస్టు అయిన వారిని ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ నివాసితులైన 29 ఏళ్ల రోహిత్, 37 ఏళ్ల సంత్రిగా గుర్తించారు. వీరిద్దరూ కేంద్ర పోర్ట్‌లు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ పరిధిలోని కోచిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు సంబంధించిన రహస్యాలను లీక్ చేసినట్లు పోలీసులు తెలిపారు.


కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరి కుట్ర..


ప్రధాన నిందితుడు రోహిత్.. మాల్పే యూనిట్‌లో ఎం/ఎస్ శుష్మా మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఉప కాంట్రాక్ట్ సంస్థలో ఇన్సులేటర్‌గా పని చేస్తున్నాడు. అంతకుముందు అతను కేరళలోని కోచిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో పని చేశాడు. తన కేరళ పదవీ కాలంలోనే.. రోహిత్ భారత నావికాదళానికి చెందిన నౌకల సంఖ్య వంటి సున్నితమైన, రహస్య సమాచారాన్ని అక్రమంగా వాట్సాప్ ద్వారా పంచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సమాచారం ద్వారా అతను అక్రమ ప్రయోజనాలను పొందినట్లు తెలుస్తోంది. ఇదీ చూడండి: పాక్‌కు గూఢచర్యం.. ఆపరేషన్ సిందూర్‌లోని కీలక రహస్యాలు చేరవేసిన వ్యక్తి అరెస్ట్


  రోహిత్ మాల్పే యూనిట్‌కు బదిలీ అయినప్పటికీ.. అతని గూఢచర్య కార్యకలాపాలు ఆగలేదు. అతను కొచ్చిలో ఉన్న ఒక స్నేహితుడి నుంచి రహస్య సమాచారాన్ని సేకరించి.. దానిని వాట్సాప్ ద్వారా అనధికార వ్యక్తికి పంపడం కొనసాగించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ చర్య జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగించింది. రెండో నిందితుడు సంత్రి పాత్ర, లీకేజీలో అతని సహకారం గురించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


ముఖ్యంగా మాల్పేలోని ఉడుపి కోచిన్ షిప్‌యార్డ్ సీఈఓ ఫిర్యాదు మేరకు మాల్పే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో రోహిత్, సంత్రిలను ఉడుపి పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని డిసెంబర్ 3 వరకు న్యాయ కస్టడీకి అప్పగించారు. ఈ నేరం భారత జాతీయ భద్రతకు సంబంధించినది కాబట్టి.. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఉడుపి పోలీసులు ఈ కుట్ర వెనుక ఇంకా ఎవరైనా వ్యక్తులు లేదా అంతర్జాతీయ ఏజెన్సీలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థల జోక్యం కూడా ఉండే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa