ట్రెండింగ్
Epaper    English    தமிழ்

5.98 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగేలా..ఏపీ సీఎం కీలక నిర్ణయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 08:09 PM

రాష్ట్రంలోని వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు, రైతులకు అండగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. అలాగే రాయితీల ద్వారా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, డ్రోన్లు వంటివి అందిస్తూ టెక్నాలజీ సాయంతో వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేలా ఆలోచనలు చేస్తోంది. ఈ క్రమంలోనే క్లస్టర్ల ద్వారా వ్యవసాయ పంటలను ప్రోత్సహించే ప్రణాళికలు రచిస్తోంది.ఉద్యానవన పంటలకు అదనపు విలువను జోడించి.. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఏపీ ప్రభుత్వం క్లస్టర్లను ఏర్పాటు చేస్తోంది. క్రాప్ వైజ్ క్లస్టర్ విధానం అమలు చేస్తూ స్థానిక వాతావరణం, మార్కెట్ డిమాండ్‌కు తగినట్లుగా రాష్ట్రంలో 11 ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఉద్యానవన పంటలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.


అందులో భాగంగా రాయలసీమలో హార్టికల్చర్‌ పంటల సాగు, ఇందుకోసం ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, కల్పిస్తున్న మార్కెటింగ్‌ సౌకర్యాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ద్వారా చేయూతనిచ్చే అంశాలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాయలసీమలో ఉద్యాన పంటల ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలనే అంశం మీద మంత్రులు, అధికారులతో చంద్రబాబు సమాలోచనలు జరిపారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం పథకమైన పూర్వోదయ పథకం కింద.. రాయలసీమలో హార్టీకల్చర్ పంటల అభివృద్ధిపై చర్చించారు.


అనంతరం రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్లు ఏర్పాటు చేసి.. ఈ క్లస్టర్ల ద్వారా ఆ జిల్లాలో హార్టికల్చర్ సాగును ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న 5.98 లక్షల మంది హార్టీకల్చర్ రైతులకు లబ్ధి కలిగించేలా ప్రణాళికలు రచించాలంటూ చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సాగు నీటి సౌకర్యాలు, డ్రిప్ ఇరిగేషన్, పంట ఉత్పత్తుల రవాణా, గోడౌన్లు, రోడ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి.. హార్టీకల్చర్ రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


 అలాగే రైతులకు కూడా సీఎం చంద్రబాబు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆహారపు అలవాట్లు, అభిరుచులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని.. ఏ పంటకు అధిక డిమాండ్ ఉందో అలాంటి పంటలనే సాగు చేయాలని సూచించారు. అలాగే సాగులో టెక్నాలజీ వాడకంపైనా దృష్టి పెట్టాలన్నారు. ఈ దిశగా రైతులకు అవసరమైన సహకారం అందించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa