ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత వైమానిక దళం చేసిన దాడుల దెబ్బకు.. పొరుగున ఉన్న పాకిస్తాన్ వణికిపోయింది. భారత్ తన వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలను ప్రయోగిస్తుంటే.. పాక్ సైన్యం ఏమీ చేయలేక కూర్చుంది. ఈ క్రమంలోనే భవిష్యత్ అవసరాల కోసం భారత్.. తన సైనిక, ఆయుధ శక్తిని భారీగా పోగు చేసుకుంటోంది. ఇందులో భాగంగానే.. రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యానికి అనుగుణంగా.. భారత రక్షణ రంగ ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ (ఎస్ఈడీ) సంస్థతో సోమవారం ఒక చారిత్రక ఒప్పందాన్ని చేసుకుంది.
ఈ ఒప్పందం ద్వారా.. అత్యంత కచ్చితత్వంతో కూడిన హామర్ ( HAMMER -Highly Agile Modular Munition Extended Range) స్మార్ట్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ సిస్టమ్ను భారత్లోనే ఉత్పత్తి చేయనున్నారు.
హామర్ ఆయుధ వ్యవస్థ యుద్ధరంగంలో ఇప్పటికే సక్సెస్ అయింది. అధిక కచ్చితత్వం, మాడ్యులర్ డిజైన్తో కూడిన ఈ ఆయుధ వ్యవస్థ.. యుద్ధంలో తన సత్తాను ప్రదర్శించింది. ఇక ఈ హామర్ ఆయుధ వ్యవస్థను.. రఫేల్ యుద్ధ విమానాలతోపాటు.. తేలికపాటి ఫైటర్ జెట్ అయిన తేజస్ సహా పలు విమానాల నుంచి ప్రయోగించడానికి వీలుగా తయారు చేశారు.
సగం సగం వాటాతో సంయుక్త సంస్థ
ఇక ఈ హామర్ ఆయుధ వ్యవస్థను తయారు చేయడానికి.. బీఈఎల్, ఎస్ఈడీ సంస్థలు చెరి సగం వాటాతో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపంలో సంయుక్త సంస్థను (Joint Venture Company) ఏర్పాటు చేయనున్నాయి. ఈ జేవీసీ ఏర్పాటుకు సంబంధించి ఫిబ్రవరి 11వ తేదీన ఏరో ఇండియా సందర్భంగా కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని ఈ తాజా ఒప్పందం మరింత బలోపేతం చేసింది.
ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యాలు
భారత వైమానిక దళం, భారత నావికాదళం కార్యాచరణ అవసరాల కోసం హామర్ మిసైల్ సిస్టమ్ను తయారు చేయడం, సరఫరా చేయడంతోపాటు.. వాటి మెయింటెనెన్స్ను మన దేశంలోనే చూసుకోవడం. ఈ హామర్ ఆయుధ వ్యవస్థను స్వదేశంలోనే 60 శాతం వరకు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విడిభాగాలు స్థానికంగానే తయారు చేయనున్నారు.
ఇక ఈ హామర్ ఆయుధ వ్యవస్థ ఉత్పత్తి దశలవారీగా బదిలీ చేయనున్నారు. ఇందులో ఫైనల్ అసెంబుల్, టెస్టింగ్, నాణ్యతకు సంబంధించిన వాటిని బీఈఎల్ సంస్థ చేపడుతుంది. ఢిల్లీలో జరిగిన ఈ ఒప్పందంపై బీఈఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ జైన్.. ఎస్ఈడీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ జీగ్లర్ సంతకాలు చేశారు. ఇది భారత అమ్ముల పొదిలోకి చేరితే.. శత్రుదేశమైన పాకిస్తాన్కు ఇక చుక్కలు చూపించవచ్చని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa