పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భద్రగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతూ చనిపోయిన ఓ మహిళ మృతదేహాన్ని చెత్తను తరలించే రిక్షాలో తీసుకెళ్లారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో లేకపోవటంతో మహిళ మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులు చెత్త రిక్షాలో సొంతూరికి తీసుకెళ్లారంటూ మీడియాలోనూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. పార్వతీపురం మన్యం ఘటనపై ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం క్లారిటీ ఇచ్చింది.
"అంబులెన్స్ సౌకర్యం కల్పించకపోవడం వల్ల పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మరణించిన మహిళ మృతదేహాన్ని చెత్త తరలించే వాహనంలో స్మశానానికి తీసుకెళ్లారని మీడియాలో జరుగుతున్న ప్రచారం సత్యదూరం. కే.రాధమ్మ అనే 65 సంవత్సరాల మహిళ డయాబెటిస్, హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారు. చాలా కాలం మందులు వాడకపోవడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తరలించారు. సరైన వైద్యం అందించినప్పటికీ.. ఆమె శుక్రవారం మరణించారు. ఒక కిలోమీటర్ దూరంలోనే ఉన్న వారి ఇంటికి మృతదేహాన్ని తీసుకుని వెళ్ళేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేసేందుకు సిబ్బంది ముందుకు వచ్చారు. అయితే రాధమ్మ సోదరుడు అప్పటి వరకూ వేచిఉండకుండా తన మూడు చక్రాల వాహనంలో మృతదేహాన్ని తీసుకుని వెళ్ళారు" అని ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం ట్వీట్ చేసింది.
అలాగే రాధమ్మ మృతదేహాన్ని తరలించిన వాహనం.. చెత్త తరలించే వాహనం కాదని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం క్లారిటీ ఇచ్చింది. అది సరకు రవాణా వాహనమని వెల్లడించింది. ఈ వాస్తవాలు అన్నీ స్థానిక విలేకరులకు కూడా తెలుసని పేర్కొంది. వైద్య సహాయం అందించడంతో పాటుగా.. తదనంతర కార్యక్రమాలలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని స్పష్టం చేసింది. అయితే దురదృష్టవశాత్తు జరిగిన ఘటనను వివిధ మాధ్యమాలలో వక్రీకరించడం జరిగిందని ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం క్లారిటీ ఇచ్చింది. దయచేసి ఈ నిజాన్ని తెలుసుకోవాలని ప్రజలను కోరింది.
మరోవైపు రాధమ్మ మృతదేహాన్ని తరలించేందుకు ఆస్పత్రి యాజమాన్యం వాహనం సమకూర్చటంలో విఫలమైందని.. ప్రైవేట్ అంబులెన్స్ సమకూర్చుకునేందుకు అయ్యే ఖర్చును భరించలేక రాధమ్మ కుటుంబం.. ఆమె మృతదేహాన్ని చెత్త సేకరించే వాహనంలో తీసుకెళ్లారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం క్లారిటీ ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa