ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాగుబోతులకు గుడ్ న్యూస్: కొత్త లిక్కర్ బ్రాండ్లు, తగ్గిన ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 29, 2025, 08:41 PM

ఏపీలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమల్లోకి తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ ఫలితాలు ఇవ్వడం ప్రారంభించాయి. నకిలీ మద్యానికి చెక్ పెట్టే లక్ష్యంతో ప్రతి మద్యం సీసాకు ప్రత్యేక నెంబర్ కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.అదే సమయంలో, గతంలో నిలిపివేసిన పాపులర్ బ్రాండ్లను తిరిగి మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కొన్ని ప్రముఖ బ్రాండ్లపై ధరల తగ్గింపు కూడా అమలు చేయడంతో మద్యం అమ్మకాలు పెరిగినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఏపీలో పాపులర్ బ్రాండ్ల విక్రయాలు భారీగా పెరిగాయి. కొన్ని కంపెనీలు ధరలు తగ్గించడంతో వినియోగదారుల ఆసక్తి పెరిగింది. ఫలితంగా మద్యం అమ్మకాల శాతం గణనీయంగా పెరిగింది. గత ప్రభుత్వ మద్యం విధానం కారణంగా రాష్ట్ర ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది.నూతన మద్యం పాలసీ అమల్లో భాగంగా పాపులర్ బ్రాండ్లను తిరిగి అందుబాటులోకి తెచ్చింది. అలాగే రూ.99కే క్వార్టర్ మద్యం ప్రవేశపెట్టడంతో తక్కువ ధరల మద్యానికి డిమాండ్ పెరిగింది. ఈ మార్పుల ఫలితంగా మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు ఉన్న జిల్లాల్లో మద్యం విక్రయాలు 40 శాతానికి పైగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 87 పాపులర్ బ్రాండ్లు తిరిగి మార్కెట్‌లోకి వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ బ్రాండ్ల అమ్మకాలు 20.7 శాతంగా ఉండగా, ప్రస్తుతం అవి 74 శాతానికి చేరాయి. అలాగే 50 బ్రాండ్ల ధరలను ప్రభుత్వం తగ్గించింది.ఇదిలా ఉండగా, ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల్లో నకిలీ నివారణ కోసం వినూత్న విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే నకిలీ మద్యం నియంత్రణ కోసం మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ప్రతి మద్యం సీసాపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వినియోగదారులు మద్యం నాణ్యతను తెలుసుకునే అవకాశం ఉంది.ఇప్పుడు దేశంలోనే తొలిసారి ప్రతి మద్యం సీసాపై ప్రత్యేక లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం బ్రాండ్, తయారీ తేదీతో పాటు సీసాకు కేటాయించిన నెంబర్‌ను స్పష్టంగా ముద్రిస్తారు. ఈ నెంబర్ ఆధారంగా మద్యం కొనుగోలు చేసేలా వినియోగదారుల్లో అవగాహన పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది.ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ శాఖతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మద్యం విధానాన్ని కేవలం వ్యాపారంగా కాకుండా, ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా అమలు చేయాలని అధికారులకు సూచించారు. జియో ట్యాగింగ్ ద్వారా మద్యం సరఫరాలో పారదర్శకత తీసుకురావాలని, షాపుల ట్రాకింగ్, రేషనలైజేషన్‌పై దృష్టి పెట్టాలని సీఎం పేర్కొన్నారు. అలాగే బాటిల్ తిరిగి ఇస్తే డిపాజిట్ రిటర్న్స్ స్కీమ్ (DRS) కింద నగదు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa