ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మస్కట్ చేరిన ఇంజిన్ లేని నౌక ఐఎన్‌ఎస్‌ కౌండిన్య..చెక్కలు, కొబ్బరి పీచు, దారాలతో తయారీ

national |  Suryaa Desk  | Published : Wed, Jan 14, 2026, 08:26 PM

ప్రాచీన స్టిచింగ్ పద్ధతి (కుట్టు పద్ధతి)లో తయారైన ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య నౌక.. 18 రోజుల పాటు అరేబియా సముద్రంలో ప్రయాణించి ఒమన్‌లోని మస్కట్ చేరుకుంది. అత్యాధునిక యంత్రాలు లేకుండా కేవలం సహజ వనరులతో నిర్మించిన ఈ నౌక.. భారతదేశానికి ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నారు. పురాతన భారతదేశ నౌకా నిర్మాణ వైభవాన్ని చాటిచెబుతూ.. ఎలాంటి ఆధునిక ఇంజిన్ సహాయం లేకుండా కేవలం గాలి, పాతకాలపు స్టిచింగ్ పద్ధతిలో నిర్మించిన ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య చరిత్రాత్మక యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది.


గుజరాత్‌లోని పోర్‌బందర్ నుంచి బయలుదేరిన ఈ ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య నౌక.. 1,400 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి బుధవారం ఒమన్‌లోని మస్కట్ తీరానికి చేరుకుంది. ఈ నౌక 2025 డిసెంబర్ 29వ తేదీన పోర్‌బందర్ నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. సరిగ్గా 18 రోజుల తర్వాత మస్కట్‌లోని 'పోర్ట్ సుల్తాన్ ఖాబూస్'కు చేరుకుంది. మస్కట్ తీరంలో ఈ నౌకకు 'వాటర్ సెల్యూట్'తో ఘనస్వాగతం లభించింది.


ఇందులో కమాండర్ వికాస్ షెరాన్ నాయకత్వంలో 16 మంది సభ్యుల బృందం (4 అధికారులు, 13 నావికులు) ఈ సాహసయాత్రలో పాల్గొన్నారు. వీరిలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాన్ కూడా ఒకరు కావడం విశేషం.


ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య ప్రత్యేకతలు


ఈ నౌక కేవలం ఒక ఓడ మాత్రమే కాదు.. భారతదేశ ప్రాచీన విజ్ఞానానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. 5వ శతాబ్దానికి చెందిన అజంతా గుహల్లోని కుడ్యచిత్రాల్లో కనిపించే నౌక నమూనా ఆధారంగా ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్యను రూపొందించారు. ఈ నౌక నిర్మాణంలో ఒక్క మేకును కూడా వాడకపోవడం మరో విశేషం. చెక్క పలకలను కొబ్బరి పీచు, దారాలు, సహజ జిగురుతో కలిపి కుట్టారు. ఈ పద్ధతిని తంకాయ్ పద్ధతి అంటారు. ఇది పూర్తిస్థాయిలో గాలి వాటున సాగే నౌక. దిక్సూచి, ప్రాచీన నక్షత్ర విజ్ఞానం ఆధారంగానే ఈ నౌకను నడిపారు.


ఇక ఈ ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య నౌకపై ఉన్న ప్రతి ఆకృతి భారతదేశ చరిత్రను గుర్తు చేస్తుంది. ఈ నౌక గాలి రెక్కలపై 2 తలల గండభేరుండ పక్షి, సూర్యుని చిహ్నాలు ఉన్నాయి. నౌక ముందు భాగంలో సింహ యాలీ శిల్పాన్ని చెక్కారు. ఓడ డెక్‌పై హరప్పా సంస్కృతి నాటి రాతి లంగరును ఉంచారు. ఈ ప్రాజెక్టును కేంద్ర సాంస్కృతిక శాఖ, భారత నౌకాదళం, హోడి ఇన్నోవేషన్స్ కలిసి చేపట్టాయి. ఒకప్పుడు భారతీయ వ్యాపారులు సముద్ర మార్గాల ద్వారా ఇతర దేశాలతో ఎలా సంబంధాలు సాగించారో ప్రపంచానికి చాటిచెప్పడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa