ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా మాంజా గొంతుకు చుట్టుకుని బైకర్ మృతి,,,,పండుగ పూట విషాదం

national |  Suryaa Desk  | Published : Wed, Jan 14, 2026, 08:27 PM

మకర సంక్రాంతి వేళ గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీ. కానీ ఆ ఆనందం ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కర్ణాటకలోని బీదర్ జిల్లా తాళమడగి బ్రిడ్జి సమీపంలో.. చైనీస్ మాంజా దారం ఓ వ్యక్తి మెడకు చుట్టుకుని అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు అంటే గొంత కట్ అయి ధారాపాతంగా రక్తం కారుతుండగానే.. ఆయన తన కుమార్తెకు చివరి సారిగా ఫోన్ చేశారు. నేను చనిపోతున్నాను.. అమ్మను బాగా చూసుకో అంటూ చెప్పారు. ఆయన మాట్లాడిన ఈ చివరి ఫోన్ కాల్.. స్థానికులు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.


అసలేం జరిగిందంటే..?


48 ఏళ్ల వయసు కల్గిన సంజుకుమార్ హోసమణి ఏదో పని నిమిత్తం బైక్‌పై వెళ్తున్నారు. ఈక్రమంలోనే రోడ్డుకు అడ్డంగా ఉన్న పదునైన నైలాన్ మాంజా (చైనీస్ మాంజా) ఒక్కసారిగా ఆయన గొంతుకు చుట్టుకుంది. దారం బలంగా లాగడంతో గొంతు లోతుగా తెగిపోయి తీవ్ర రక్తస్రావం మొదలైంది. బైక్ పైనుంచి కింద పడిపోయిన ఆయన.. మృత్యువు కళ్లముందు కనిపిస్తున్నా ధైర్యం చేసి తన కూతురికి ఫోన్ చేశారు. రక్తం ఓడుతున్న స్థితిలో ఆయన తన కూతురితో "అమ్మను జాగ్రత్తగా చూసుకో" అని చెప్పిన మాటలు అక్కడి వారిని కలచివేసాయి.


స్థానికులు వెంటనే స్పందించి గాయాన్ని బట్టతో అదిమి పట్టి రక్తస్రావాన్ని ఆపే ప్రయత్నం చేశారు. అంబులెన్స్‌కు సమాచారం అందించినప్పటికీ.. అది వచ్చేసరికి సమయం మించిపోయింది. సంజుకుమార్ అక్కడికక్కడే కన్నుమూశారు. అంబులెన్స్ సకాలంలో వచ్చి ఉంటే ఆయన బతికేవారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. మన్న ఎఖెల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మృత్యుపాశంగా చైనీస్ మాంజా


ఒకప్పుడు గాలిపటాల కోసం నూలు దారాలను వాడేవారు. కానీ ఇప్పుడు తక్కువ ధర, ఎక్కువ బలం కోసం 'నైలాన్' లేదా 'చైనీస్ మాంజా'లను వాడుతున్నారు. ఇవి ఎంత పదునుగా ఉంటాయంటే.. చర్మం, కండరాలను క్షణాల్లో కోసేస్తాయి. ముఖ్యంగా బైకర్లు వేగంగా వెళ్లేటప్పుడు ఈ సన్నని దారాలు కంటికి కనిపించవు. నేరుగా గొంతుకు తగలడంతో ప్రాణాలు పోతున్నాయి. ఈ వారం రోజుల వ్యవధిలోనే మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో రఘువీర్ ధాకర్ (45) అనే వ్యక్తి ఇదే తరహాలో మరణించారు. గతంలో ఢిల్లీలో కూడా 2025 జూలైలో యశ్ గోస్వామి అనే వ్యాపారి, 2023లో ఏడేళ్ల చిన్నారి ఈ మాంజాకు బలికావడం గమనార్హం. అధికారులు ఎన్ని దాడులు చేస్తున్నా.. విక్రయాలపై కఠినమైన నిషేధం అమలు కాకపోవడమే ఈ వరుస మరణాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa