సీనియర్ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ. మాజీ కేంద్ర మంత్రులు శశిథరూర్, జైరామ్ రమేశ్, పవన్ ఖేరా సహా పలువురి సీనియర్ నాయకులపై విమర్శలు గుప్పించారు. త్వరలో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని ఎందుకంటే, కాంగ్రెస్ నాయకులు ‘కమ్యూనిస్టులను ద్వేషించే కంటే ఒకరినొకరు ఎక్కువగా ద్వేషించుకుంటారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై ప్రశంసలు కురిపించిన అయ్యర్.. వచ్చే ఎన్నికల్లో ఆయనే మళ్లీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా పార్టీ అధికార ప్రతినిధి కాదని, ఓ తోలుబొమ్మ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. ‘‘గత రెండేళ్లుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు.. అధికార ప్రతినిధిగా పవన్ ఖేరాను తప్పించకుంటే ఇప్పుడున్న పరిస్థితిలోనే కాంగ్రెస్ ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కేరళ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయవకాశాల గురించి ప్రశ్నించగా.. ‘‘ఆ రాష్ట్రంలో పార్టీ విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను.. కానీ కాంగ్రెస్ నాయకుల మధ్య విబేధాల కారణంగా గెలుస్తామని అనుకోను.. కమ్యూనిస్ట్లను ద్వేషించే కంటే ఒకరినొకరు తిట్టుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు.
ఈ క్రమంలో తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ పై మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. థరూర్ పాకిస్థాన్ వ్యతిరేకి అని, విదేశాంగ మంత్రి పదవి కోరకుంటున్నాడని ఆరోపించారు. గతేడాది ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించిన శశిథరూర్.. పార్టీ అభ్యంతరం చెబుతున్నప్పటికీ పాక్పై తీసుకున్న చర్యల గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్రం నియమించిన ప్రతినిధుల బృందంలో ఒకదానికి నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. అలాగే, కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగం చీఫ్ జైరామ్ రమేశ్ తన పనితీరును ఇలాగే కొనసాగించాలని అన్నారు. ఇటీవల తిరువనంతపురంలో ‘విజన్ 2031.. డెవలప్మెంట్, డెమొక్రసీ’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో మణిశంకర్ అయ్యర్ పాల్గొన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరుకావద్దని కోరుతూ కేరళ కాంగ్రెస్ నాయకత్వం అనేక మంది మేధావులకు లేఖ రాసింది. ఈ సెమినార్లో అయ్యర్ మాట్లాడుతూ... పంచాయతీ రాజ్, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కలను నేరవేర్చడంలో కేరళ టాప్లో ఉందని, ఇందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నానని అన్నారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్. మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa