ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై అధ్యయనం జరిపి 45 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని దినేష్ కుమార్ను ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన పరిపాలన లోపాలు, టెండర్లపై సమగ్ర పరిశీలన చేసి ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించనుంది.
ఏకసభ్య కమిషన్ ఏర్పాటుపై వైసీపీ రియాక్షన్
మరోవైపు తిరుమల లడ్డూ అంశంలో ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడంపై వైసీపీ స్పందించింది. ఈ విషయంపై వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయంపై భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై చంద్రబాబుకు నమ్మకం లేదని భూమన విమర్శించారు. సీబీఐ సిట్ నివేదిక తమకు అనుకూలంగా రాలేదు కనుకే.. ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు కుట్రలను తిరుమల శ్రీవారు బయటపెట్టారంటూ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై సీబీఐ సిట్ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా అధికార, విపక్షాల మధ్యన మాటలయుద్ధం జరుగుతోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ సిట్ నివేదిక చెప్పిందంటూ వైసీపీ చెప్తుండగా.. కల్తీ జరిగినట్లు నివేదిక ద్వారా స్పష్టమైందని ప్రభుత్వం వాదన. ఈ నేపథ్యంలోనే ఇటీవల విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన కూటమి పార్టీలు.. ఈ వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విలేకర్ల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తిరుమల లడ్డూలో కల్తీకి సంబంధించి అసలు దోషులను గుర్తిస్తామన్న చంద్రబాబు.. సీబీఐ సిట్ తమకు పంపిన నివేదికపై ఏకసభ్య కమిషన్ ద్వారా అధ్యయనం జరుపుతామని ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలోనే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. 45 రోజుల్లోగా సీబీఐ నివేదికతో పాటుగా ఇతర అంశాలపై అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa