ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమ పెళ్లిళ్లకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరని కొత్త రూల్స్

national |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 07:11 PM

గుజరాత్‌లో వివాహ రిజిస్ట్రేషన్ కోసం తల్లిదండ్రుల సమ్మతిని తప్పనిసరి చేయాలన్న అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. అయితే ప్రేమ పెళ్లిళ్ల పేరుతో లవ్ జిహాదీ, లవ్ మ్యారేజ్ మోసాలను అరికట్టేందుకు ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చినట్లు గుజరాత్ ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ నిబంధనలు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడమేనంటూ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు పలు కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులకు కూడా ఈ నిర్ణయం విరుద్ధంగా ఉందని పేర్కొంటున్నారు. దీంతో లవ్ మ్యారేజ్‌ల విషయంలో గుజరాత్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిబంధనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి.


తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు చేసుకునే ప్రేమ పెళ్లిళ్లు.. కుల, మతాంతర వివాహాల గురించి అటు అమ్మాయి, ఇటు అబ్బాయి తరఫు తల్లిదండ్రులకు తెలియజేయాలని కొత్త నిబంధనలు తెచ్చింది. దీనివల్ల లవ్ మ్యారేజ్ చేసుకునేవారు తమ పెళ్లి గురించి తల్లిదండ్రులకు తెలుసో లేదో వారి దరఖాస్తులో పేర్కొనాల్సిందేనని తేల్చి చెప్పింది. పెళ్లి చేసుకునేవారి దరఖాస్తులో ఇచ్చిన వివరాల ఆధారంగా 10 రోజుల్లోగా రెండు కుటుంబాల్లో తల్లిదండ్రులకు సమాచారం అందించాలని రిజిస్ట్రార్‌కు బాధ్యతలు అప్పగించారు. కొత్త రూల్స్ ప్రకారం దరఖాస్తు చేసినప్పటి నుంచి మ్యారేజ్ సర్టిఫికెట్ జారీకి 30 రోజుల వ్యవధి తప్పనిసరి అని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది.


 గత కొంతకాలంగా ప్రేమ పేరుతో పెళ్లిళ్లు చేసుకుని ఆ తర్వాత మోసాలు చేయడం పెరిగిపోతున్నాయి. వీటితోపాటు సోషల్ మీడియా కొత్త పరిచయాలు, ప్రేమ పేరుతో కొందరు వల విసిరి పెళ్లి చేసుకుని చేస్తున్న మోసాలు పెరిగిపోవడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు.. లవ్ జిహాదీ పేరుతో మతమార్పిడులకు పాల్పడుతున్నారనే నేపథ్యంలోనే ఇలాంటి వివాహాలను కట్టడి చేయాలని గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ కొత్త రూల్స్ తెచ్చింది.


అయితే వివాహాల రిజిస్ట్రేషన్‌కు తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి చేయాలని గుజరాత్ ప్రభుత్వం భావించడం.. రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత హక్కులను హరించడమేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతీ వ్యక్తికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నాయని.. ఎవరి జోక్యం లేకుండా తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ కూడా వారికి ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పేర్కొంటున్నారు. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఈ వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకునేలా ఉందని చెబుతున్నారు.


లక్ష్మీబాయి చందరగి కేసు (2021)


ఇద్దరు మేజర్లు పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు కుటుంబం, కులం, సమాజం సమ్మతి అవసరం లేదని 2021 లక్ష్మీబాయి చందరగి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమకు నచ్చిన వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం అనేది వారి ఇష్టమని.. దాన్ని సమాజం పట్టింపుల కోసం వదులుకోకూడదని కోర్టు పేర్కొంది.


షఫీ జహాన్ వర్సెస్ కె.ఎం. అశోకన్ (2018)


ఇక 2018 షఫీ జహాన్ వర్సెస్ కె.ఎం. అశోకన్ కేసులో.. ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని, జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ క్రమంలోనే 24 ఏళ్ల యువతికి సొంతంగా నిర్ణయాలు తీసుకోలేదని.. ఆమెను ఎవరైనా ఈజీగా తప్పుదారి పట్టిస్తారని కేరళ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.


లతా సింగ్ కేసు (2006)


అంతర్జాతీయ వివాహాలకు రక్షణ కల్పిస్తూ, కొన్నిసార్లు కుటుంబమే హింసకు కేంద్రంగా మారుతుందని 2006 లతా సింగ్ కేసులో సుప్రీంకోర్టు గుర్తించింది.


ప్రత్యేక వివాహ చట్టం సాధారణంగా కింద పెళ్లి చేసుకోవాలంటే 30 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను ఢిల్లీ, అలహాబాద్ హైకోర్టులు ప్రశ్నించాయి. ఇలాంటి నోటీసుల వల్ల పెళ్లి చేసుకునే వారి గోప్యతకు భంగం కలుగుతుందని.. ఇలా చేయడం వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లు అవుతుందని కోర్టులు అభిప్రాయం వ్యక్తం చేశాయి. తమ ఇష్టపూర్వకంగా తీసుకునే నిర్ణయాల్లో సమాజానికి, కుటుంబానికి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టులు స్పష్టం చేశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa