దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానయాన సంస్థ 'ఇండిగో'సర్వీసులపై బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ప్రయాణంలో లగేజీని విమానయాన సంస్థ పోగొట్టడమే కాకుండా.. ఆ విషయంలో సిబ్బంది వ్యవహరించిన తీరు "సిగ్గుచేటు"గా ఉందని ఆయన మండిపడ్డారు. ఒక పార్లమెంటు సభ్యుడికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. సామాన్య ప్రయాణికుల గతేంటని ఆయన ప్రశ్నించారు.
అసలేం జరిగిందంటే..?
చాందీ చౌక్ లోక్సభ సభ్యుడు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జనరల్ సెక్రటరీ అయిన ప్రవీణ్ ఖండేల్వాల్.. ఫిబ్రవరి 20వ తేదీ అంటే శుక్రవారం రోజు ఢిల్లీ నుంచి కర్ణాటకలోని బెలగావికి ఇండిగో ఫ్లైట్ (6E-5237)లో ప్రయాణించారు. అయితే ఆయన క్షేమంగా గమ్యస్థానానికి చేరుకున్నారు. కానీ చెక్-ఇన్ చేసిన లగేజీ మాత్రం రాలేదు. అది ఎక్కడ ఉందో చెప్పడానికి ఇండిగో సిబ్బంది వద్ద ఎటువంటి సమాచారం లేకపోవడం ఎంపీని విస్మయానికి గురిచేసింది. లగేజీలో అత్యంత కీలకమైన పత్రాలు, విలువైన వస్తువులు ఉండటంతో పాటు అత్యవసర దుస్తుల కోసం తాను బయట షాపింగ్ చేయాల్సి వచ్చిందని.. ఇది తనకు తీవ్ర మనోవేదనను, ఆర్థిక నష్టాన్ని కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రికీ, సీఈఓకూ ఫిర్యాదు..
ఈ నిర్లక్ష్యంపై ప్రవీణ్ ఖండేల్వాల్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ను ట్యాగ్ చేస్తూ.. ఈ ఘోర తప్పిదానికి తక్షణమే వివరణ ఇవ్వాలని, లగేజీ ఎక్కడ ఉందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజారపు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఇండిగోలో ఆపరేషనల్ ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయని, ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.
ఇండిగో ఎయిర్లైన్స్ గత కొంతకాలంగా విమానాల రద్దు, జాప్యం, రీఫండ్ సమస్యలు, లగేజీ మిస్సింగ్ ఫిర్యాదులతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజా ఘటనపై ఇండిగో యాజమాన్యం ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. విమాన ప్రయాణాల్లో పెరిగిన చార్జీలకు అనుగుణంగా సౌకర్యాలు లేకపోవడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa