తమ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణానికి బదులు తీర్చుకుంటామని శపథం చేసిన ఇరాన్.. ఇజ్రాయెల్, పశ్చిమాసియాలో అమెరికాకు మద్దతు ఇచ్చిన దేశాలపై దాడులు చేస్తోంది. తాజాగా, టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయంపై దాడిచేసినట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ దళాలు ప్రకటించాయి. నెతన్యాహు ఆఫీసుపై క్షిపణితో దాడిచేసినట్టు వెల్లడించాయి.
‘‘జియోనిస్ట్ పాలనలో నేరస్థుడైన ప్రధాన మంత్రి కార్యాలయం, వారి వైమానిక దళ కమాండర్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా చేసుకున్నాం’’ అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడికి ఖేబర్ క్షిపణులను వాడినట్టు తెలిపింది. ఇరాన్ నుంచి ప్రయోగించిన కొత్త క్షిపణులను గుర్తించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించిన కొద్ది సేపటికే జెరూసలేంలో వరుస పేలుళ్ల శబ్దాలు వినిపించాయని AFP జర్నలిస్టులు నివేదించారు.
‘‘కొద్దిసేపటి కిందట ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ భూభాగం వైపు ప్రయోగించిన క్షిపణులను IDF గుర్తించింది. ముప్పును అడ్డుకోవడానికి రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయి’ అని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్పై అమెరికా మద్దతుతో విరుచుకుపడుతోన్న ఇజ్రాయెల్.. క్షిపణి స్థావరాలను, యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేస్తోంది. అటు, ఇరాన్ సైతం గల్ఫ్ దేశాల్లోని అమెరికా వైమానిక, సైనిక స్థావరాలు, ఆస్తులపై దాడులు చేస్తోంది. యుద్ధం మూడో రోజుకు చేరుకోగా... ఇరాన్ సుప్రీం నేత, ఇతర సీనియర్ అధికారులు సహా 550 మందికి పైగా మరణించినట్టు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది.
ఇదిలా ఉండగా, ఇరాన్ దాడులపై ఐరోపా కమిషన్ చీఫ్ ఉరుసులా వన్ డెర్ లేయాన్ తీవ్రంగా మండిపడ్డారు. పశ్చిమాసియాలోని సౌర్వభౌమాధికార ప్రాంతాలపై ఇరాన్, దాని ప్రాక్సీల బాధ్యతారహితమైన, విచక్షణారహితమైన దాడులకు పాల్పడుతున్నాయని ఉరుసులా ఆగ్రహం వ్యక్తం చేశారు. సైప్రస్లోని బ్రిటన్ వైమానిక స్థావరం, సౌదీ అరేబియాలో ఆయిల్ రిఫైనరీలపై దాడులను ఆమె తీవ్రంగా ఖండించారు. అలాగే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము తీవ్రంగా పనిచేస్తున్నామని, ఈ ప్రాంతంలో స్థిరత్వం అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa