శనివారం నాడు చేపట్టిన అమెరికా- ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ సైతం ప్రతికారం తీర్చుకుంటోంది. ఇరాన్ భీకర దాడులతో మూడు రోజులుగా పశ్చిమాసియా అట్టుడుకుతోంది. అమెరికాకు మద్దతుగా నిలిచిన గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుంది. అయితే, ప్రతీకార దాడుల విషయంలో ఒమన్ను మాత్రం మినహాయించింది. తాజాగా, దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పంందించారు. ఈ దాడికి నాయకత్వం వహిస్తున్న ఇరాన్ ఎలైట్ ఫోర్సెస్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్వతంత్రంగా వ్యవహరిస్తోందని, ఒమన్పై దాడి చేయడం ‘మా ఎంపిక కాదు’ అని ఆయన నొక్కి చెప్పారు.
మే 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ను ఆయతుల్లా ఖమేనీ తండ్రి రౌహెల్లా ఖమేనీ ఏర్పాటుచేశారు. ఇది సంప్రదాయ ఇరాన్ సైన్యానికి భిన్నమైంది. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. 1979 పాలన మార్పు తరువాత, ఇరాన్ సరిహద్దుల రక్షణ, శాంతి భద్రతల నిర్వహణకి ఒక సాధారణ సైనిక దళం (ఆర్తేష్), ఇరాన్లోని ఇస్లామిక్ వ్యవస్థను రక్షించడానికి ప్రత్యేక రివల్యూషనరీ గార్డ్ (పాస్దరన్) రెండింటినీ అందించే కొత్త రాజ్యాంగాన్ని పాలకులు ప్రవేశపెట్టారు. ఇరాన్ సుప్రీం నేత ఆదేశాల ప్రకారం రివల్యూషనరీ గార్డ్స్ పనిచేస్తుంది. శనివార అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మరణించే ముందు వరకూ ఆయతుల్లా అలీ ఖమేనీ దానికి చీఫ్ స్థానంలో ఉన్నారు. అంటే, చీఫ్ మరణంతో IRGC ఇప్పుడు స్వతంత్రంగా పనిచేస్తోంది.
ఇదిలా ఉండగా, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరఘ్చీ అల్ జజెరా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓమన్ పోర్టుపై దాడి గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఒమన్ నౌకాశ్రయంపై దాడి గురించి ప్రశ్నించగా.. ‘ఒమన్లో ఏం జరిగిందో అది మా ఛాయిస్ కాదు.. మన సాయుధ దళాలు తాము ఎంచుకునే లక్ష్యాల గురించి జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే చెప్పాం’ అని అన్నారు. ‘నిజంగా చెప్పాలంటే మా సైనిక వ్యవస్థలు స్వంత్రంగా ఉన్నాయి.. ముందుగా వారికి ఇచ్చిన సాధారణ సూచనలు ప్రకారం అవి ముందుకెళ్తున్నాయి.. చర్యలు తీసుకుంటున్నాయి’ అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి ఇరాన్ ప్రభుత్వ ఆదేశాలతో ఐఆర్సీజీ పనిచేయడం లేదని, హత్యకు ముందు ఖమేనీ ఇచ్చిన సూచనల ప్రకారం చర్యలు చేపడుతోందని అర్ధమవుతోంది.
ఇరాన్ కేసు ప్రత్యేకం
గల్ఫ్లోని పొరుగు దేశాలతో ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరాన్ ప్రయత్నిస్తున్నందున అరాఘ్చి వ్యాఖ్యలను దాడులకు ఒక సాకుగా కూడా చూడొచ్చని అసోసియేట్ ప్రెస్ నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా సైన్యాలు పోరాటం, యుద్ధాల కోసం ఆకస్మిక ప్రణాళికను రూపొందించడం సర్వసాధారణం. వారి కేంద్ర ప్రభుత్వాలు ప్రభావితమైతే ఏమి చేయాలో కూడా ఇందులో ఉంది. ‘కానీ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తన విస్తారమైన బాలిస్టిక్ క్షిపణి ఆయుధగారాలు, పేలుడు పదార్థాలను మోసుకెళ్లే డ్రోన్ల నిల్వలో ఎక్కువ భాగాన్ని నియంత్రిస్తుంది కాబట్టి ఇది ఒక ప్రత్యేక సందర్భం’ అని అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక పేర్కొంది.
ఐఆర్సీజీని స్వతంత్ర సంస్థగా విస్తరించే అధికారాలను ఖమేనీ కట్టబెట్టారు. ఇది నిర్మాణ సంస్థలు, పోర్టులు, టెలికమ్ నెట్వర్క్స్ మాత్రమే కాదు, లేజర్ కంటి చికిత్స కేంద్రాలను కూడా నిర్వహిస్తోంది. దీని అర్థం దాని వద్ద తగిన వనరులు ఉన్నాయి.తదుపరి సుప్రీం లీడర్ ఎన్నికయ్యే వరకు ఐఆర్సీజీకి చీఫ్ ఉండరు. తమ సుప్రీం నేత హత్యకు ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని రివల్యూషనరీ గార్డ్స్ ప్రతిజ్ఞ చేసింది. ‘ఉమ్మా ఇమామ్ హంతకులకు కఠినమైన, నిర్ణయాత్మకమైన, విచారకరమైన శిక్ష విధించడానికి ఇరాన్ ప్రతీకార హస్తం వారిని వదలదు’ అని గార్డ్స్ తమ అధికారిక టెలిగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa