దేశంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా మారడంతో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలను దాదాపు పది రోజులుగా వరద కష్టాలు వీడటం లేదు. తాజాగా, మరో ఎనిమిది రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ చేసింది. అంటే, ఈ రాష్ట్రాల్లో ఒక్క రోజులో 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. గోవా, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్లో వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
రాబోయే ఐదు రోజుల్లో గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. జులై 19 నుంచి గుజరాత్పై వరుణుడు ప్రతాపం చూపుతాడని, ఉత్తరాఖండ్, మధ్య భారతదేశంలో వచ్చే రెండు రోజులు అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. అంతేకాదు, వచ్చే నాలుగైదు రోజుల్లో ఈశాన్యం, తూర్పు భారతంతో పాటు వాయువ్య ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపింది. ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్తో పాటు హిమాచల్ ప్రదేశ్, తూర్పు యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, కొంకణ్ తీరం, గోవా, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు కురుస్తాయని పేర్కొంది.
మధ్య పాకిస్థాన్ నుంచి పంజాబ్ మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీంత పాటు రాబోయే 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ప్రజలకు భద్రతా సూచనలను జారీ చేసింది. వరదలు, లోతట్టు ప్రాంతాలు, హాని కలిగించే నిర్మాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలతో ముఖ్యంగా ఉత్తరాఖండ్ వంటి కొండ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడే అవకాశాలు కూడా ఆందోళన కలిగిస్తాయి.
ఈ నేపథ్యంలో వరద ప్రభావిత రాష్ట్రాల్లోని నివాసితులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. వాతావరణ అప్డేట్ల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇవ్వాలని అధికారులకు ఐఎండీ సూచించింది. ప్రజల భద్రతను నిర్ధారించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. యమునా నది ప్రవాహం తగ్గుముఖం పట్టినప్పటికి ఇంకా చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఆదివారం కూడా భారీ వర్షం పడటంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. హత్నికుండ్ నుంచి యమునా నదిలోకి 70 వేల క్యూసెక్కుల నీటిని హరియాణా విడుదల చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa