పంజాబ్లోని వాల్మీకులు, మజాబీలను (సిక్కులు) మహా దళితులుగా గుర్తిస్తూ బీసీ, ఎస్సీ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పించిన 15 శాతం రిజర్వేషన్లను పంజాబ్ హరియాణా హైకోర్టు రద్దుచేసింది. గతంలో అమరీందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తర్వాత అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వం వాటిని కొనసాగించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాలతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వచ్చింది.
దీనిపై చర్చను ప్రారంభించి పంజాబ్ అడ్వకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్.. మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల్లో అత్యంత వెనుకబడిన వారిని గుర్తించాలని అన్నారు. సమాన ఉపాధి అవకాశాలను పొందేలా వారికి మార్గాలను అందించిందని తెలిపారు. సీనియర్ న్యాయవాది నిధేష్ గుప్తా మాట్లాడుతూ.. పంజాబ్ జనాభాలో ఎస్సీలు 33% ఉన్నారని, వారిలో వాల్మీకులు (చురాస్, భంగీలు), మజాబీలు (సిక్కులు) 29% ఉన్నారు. 81% ప్రభుత్వ ఉద్యోగాల్లో 43% షెడ్యూల్డ్ కులాల వారు ఉన్నారని చెప్పారు.
‘ఉద్యోగ నియమాక పరీక్షలో 99% మార్కులు సాధించిన ఎగువ తరగతి అభ్యర్థి కంటే 56% పొందిన వెనుకబడిన తరగతి సభ్యునికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే ఎగువ తరగతి వ్యక్తికి విమానాలు, జీవితంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి.. అయితే, వెనుకబడిన తరగతి వ్యక్తి కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యాన్ని పొందడం ద్వారా సామాజికంగా గణనీయమైన అభివృద్ధిని సాధించిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్కు అర్హులైన వారి జాబితా నుంచి తొలగించబడుతుందని ప్రతిపాదనను కొనసాగించారు. రాజ్యాంగ నిర్మాతలతో సహా ఎవరూ రిజర్వేషన్లు శాశ్వతంగా కొనసాగించడం కోసం ఉద్దేశించలేదు’ అని అడ్వకేట్ జనరల్ సింగ్ అన్నారు.
ఈ సందర్భంగా స్వయంగా దళితుడైన జస్టిస్ గవాయ్ జోక్యం చేసుకుంటూ.. ‘ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి, ఐఏఎస్, ఐపీఎస్ వంటి కేంద్ర సర్వీసుల్లోకి ప్రవేశించిన తర్వాత అత్యుత్తమ సౌకర్యాలను పొందుతాడు. అయినప్పటికీ, అతని పిల్లలు, వారి పిల్లలు రిజర్వేషన్ ప్రయోజనాలను పొందుతూనే ఉన్నారు. ఇది కొనసాగాలా?’ అని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఉద్యోగంలో అధిక ప్రాతినిధ్యాన్ని పొందినవారు ఎస్సీ జాబితాలోని మిగతా అణగారిన వర్గాలకు మార్గం కల్పించాలని పంజాబ్ ప్రభుత్వం వాదించింది. ఏజీ, సీనియర్ లాయర్ షాదన్ ఫరాసత్ ఇద్దరూ చిన్నయ్య కేసులో తీర్పును కుల వర్గీకరణ పట్ల సంకుచిత దృక్పథాన్ని తప్పుపట్టారు. ఈ తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో ఐదుగురు న్యాయమూర్తులైన జస్టిస్ సంతోష్ హెగ్డే, జస్టిస్ ఎస్ ఎన్ వరియావా, జస్టిస్ బి పీ సింగ్, జస్టిస్ హెచ్ కె సెమా, జస్టిస్ ఎస్ బి సిన్హాలు తరగతి, కులాలతో సంబంధం లేకుండా పౌరుల మధ్య నిజమైన సమానత్వం లక్ష్యాన్ని సాధించడానికి పొందుపరిచిన రాజ్యాంగ నిబంధనలు, కుల వ్యవస్థను అవగాహన సరిగ్గా అవగాహన చేసుకోలేకపోయారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa