దేశంలో లోక్సభ ఎన్నికలకు ముందు పౌరసత్వ సవరణ చట్టం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019 లోనే చట్టం ఆమోదం పొందినా.. తాజాగా ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం దాన్ని అమల్లోకి తీసుకురావడం తీవ్ర దుమారానికి కారణం అయింది. ఈ నేపథ్యంలోనే సీఏఏను తీవ్రంగా వ్యతిరేకిస్తూ చాలా మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే వాటన్నింటిపైనా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్లకు సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అందుకు 3 వారాల గడువు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో సీఏఏ అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
పౌరసత్వ సవరణ చట్టం అమలుపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన 237 పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టం అమలుపై స్టే విధించడానికి నిరాకరించింది. మరోవైపు.. ఈ 237 పిటిషన్లకు వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేసింది. ఇందు కోసం 3 వారాల గడవును ఇచ్చింది. అనంతరం ఈ కేసు విచారణను ఏప్రిల్ 9 వ తేదీన చేపడతామని సుప్రీం కోర్టు తెలిపింది.
సీఏఏ అమలును సవాల్ చేస్తూ కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్-ఐయూఎంఎల్, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-డీవైఎఫ్ఐ, తృణముల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సహా మొత్తం 237 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అయ్యాయి. ఈ క్రమంలోనే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్-ఐయూఎంఎల్ తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తున్నారు. 1995 నాటి పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 2 ను సవరించారని.. దాని ప్రకారమే ఆఫ్ఘన్, బంగ్లా, పాక్లో ఉన్న హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సి, క్రైస్తవులకు పౌరసత్వాన్ని ఇవ్వనున్నారని తెలిపారు. ఆ 3 దేశాల్లో మతపరమైన హింసకు గురవుతున్న వారిని రక్షించాలన్న ఉద్దేశంతో ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని రూపొందించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa