ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలట్ల ఓటింగ్ ప్రక్రియ నడుస్తోంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర పరిణామాలు కనిపించాయి. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోస్టల్ బ్యాలట్ పోలింగ్ కేంద్రం దగ్గర.. వైఎస్సార్సీపీకి ఓటు వేయాలని కోరుతూ ఆ పార్టీ కార్యకర్తలు ఉద్యోగ, ఉపాధ్యాయుల కాళ్లు మొక్కుతూ, సాష్టాంగ ప్రణామాలు చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వైఎస్సార్సీపీ నేతలు తమ పార్టీకి ఓటు వేయాలని పలువురు ఉద్యోగుల్ని కోరారు. వైఎస్సార్సీపీ నేతలు కాళ్లపై పడటంతో కొందరు ఉద్యోగులు అవాక్కయ్యారు.
మరోవైపు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలట్ ఓట్లకు సంబంధించి పొరపాటు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అధికారులపై చర్యలు తీసుకున్నారు.. ఈ తప్పుకు బాధ్యులైన నాదెండ్ల తహసీల్దారు వరకుమార్ను సస్పెండ్ చేశారు. అలాగే రిటర్నింగ్ అధికారి నారదమునికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ పొరపాటు వలన ఇబ్బందిపడిన ఉద్యోగులు 8, 9 తేదీల్లో మళ్లీ ఓటు వేసే అవకాశం కల్పించారు. నాదెండ్ల మండలం గణపవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది. అక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓటు బదులు ఈవీఎంలో పెట్టే బ్యాలెట్ను ఉద్యోగులకు ఇవ్వడం కలకలంరేపింది. ఉద్యోగులు కూడా ఈ విషయాన్నిగ మనించకుండా ఓటు వేశారు.. ఈ చిన్న తప్పుతో మొత్తం 1,219 మంది ఉద్యోగుల ఓట్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఓటింగ్ పూర్తయిన తర్వాత జరిగిన తప్పును గుర్తించిన అధికారులు.. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పారు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
కాకినాడలోని పీఆర్ ప్రభుత్వ కాలేజీలో పోస్టల్ బ్యాలట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు, కొత్తపేట, రామచంద్రపురం, మండపేట, పి.గన్నవరంతో పాటూ పలు నియోజకవర్గాలకు చెందిన ఉద్యోగులకు ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. అయితే ఇక్కడ ఓటరు జాబితాల్లో కొందరి పేర్లు కనిపించలేదు.. దీంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి వారి నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించడంతో వివాదం సద్దుమణిగింది. ఇవాళ ఇక్కడే వీరంతా ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు అధికారులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa