ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ దగ్గర పడుతోంది. మే 13వ తేదీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు తమ మద్దతును రాజకీయ పార్టీలకు ప్రకటిస్తున్నారు. కొంతమంది ఆ పార్టీల తరుఫున ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే డార్లింగ్ ప్రభాస్ ఫ్యామిలీ ఎటువైపు ఉందనేది స్పష్టమైంది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు బీజేపీ తరుఫున ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు, ఆ తర్వాతి రోజుల్లో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయితే ఈ ఎన్నికల సమయంలో కూడా ప్రభాస్ కుటుంబసభ్యులు బీజేపీ తరుఫున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత వైసీపీలో చేరతారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే వారి మద్దతు ఎవరికి అనేది తేలిపోయింది.
నరసాపురం బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మకు మద్దతుగా దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ప్రచారం చేశారు. శ్యామలాదేవితో పాటుగా ఇతర కుటుంబసభ్యులు కూడా శ్రీనివాసవర్మకు మద్దతుగా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రచారం చేశారు. నరసాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని కూటమి అభ్యర్థుల తరుఫున కూడా ప్రభాస్ ఫ్యామిలీ ప్రచారం చేస్తోంది. నరసాపురం అసెంబ్లీకి జనసేన తరుఫున పోటీచేస్తున్న బొమ్మిడి నాయకర్ తరుఫున కూడా ప్రభాస్ ఫ్యామిలీ ప్రచారం నిర్వహించారు. బొమ్మిడి నాయకర్, శ్రీనివాసవర్మకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
మరోవైపు కృష్ణంరాజు గతంలో కాకినాడ, నరసాపురం లోక్ సభ నియోజకవర్గాల నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కాకినాడ, నరసాపురం లోక్ సభ నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. మాజీ ప్రధాని వాజ్పేయీ ప్రభుత్వ హయాంలో కేంద్రమంత్రిగానూ వ్యవహరించారు. ఈ నేపథ్యంలో కాకినాడ, నరసాపురం లోక్ సభ నియోజకవర్గాలలో ఏదో ఒక చోట ఆయన సతీమణి శ్యామలాదేవిని వైసీపీ తరుఫున బరిలోకి దింపుతారని ప్రచారం జరిగింది. అయితే అటువైపు నుంచి ఆహ్వానం లేదో.. లేదా వీరే వెళ్లలేదో కానీ ప్రభాస్ ఫ్యామిలీ వైసీపీలో చేరతారన్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఇప్పుడు ఎన్డీయే అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa