ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడ్డంగా దొరికిన సీబీఐ అధికారులు.. అవినీతిని అడ్డుకోవాల్సిన వారే లంచాలకు కక్కుర్తి

national |  Suryaa Desk  | Published : Wed, May 22, 2024, 08:58 PM

మధ్యప్రదేశ్‌లో బయటపడిన నర్సింగ్‌ కాలేజీ స్కామ్‌ మరో మలుపు తిరిగింది. ఈ నర్సింగ్ కాలేజీ స్కామ్ కేసును సీబీఐకి అప్పగించగా.. దర్యాప్తు జరుపుతున్న సీబీఐ అధికారులే అవినీతికి పాల్పడటం మరింత సంచలనంగా మారింది. నర్సింగ్ కాలేజీ స్కామ్‌కు సంబంధించి దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్సింగ్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల సందర్భంగా.. ఆయా కాలేజీల నుంచి దర్యాప్తు జరుపుతున్న సీబీఐ అధికారులు భారీగా లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీబీఐ ఉన్నతాధికారులు నిఘా పెట్టగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.


నర్సింగ్ కాలేజీ కుంభకోణం కేసులో.. ఆయా కాలేజీలపై చర్యలు తీసుకోకుండా వాటికి అనుకూలంగా కేసును మార్చేందుకు సీబీఐ అధికారులు లంచాలు తీసుకున్నట్లు తెలిసింది. ఆయా నర్సింగ్ కాలేజీలకు అనుకూలంగా రిపోర్ట్‌ను ఇచ్చేందుకు సీబీఐ అధికారులు లక్షల కొద్ది తీసుకున్నట్లు గుర్తించారు. సీబీఐ అధికారులే లంచాలు తీసుకోవడం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారం వెలుగుచూడడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పలువురు సీబీఐ అధికారులతో పాటు 22 మంది ఇతర వ్యక్తులపైనా కేసు నమోదు చేశారు. అందులో కొందర్ని అరెస్ట్ చేసినట్లు సీబీఐ ఉన్నతాధికారులు వెల్లడించారు.


మధ్యప్రదేశ్‌లో కొన్ని రోజుల క్రితం నర్సింగ్‌ కాలేజీల కుంభకోణం వెలుగుచూసింది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ హైకోర్టులో విచారణ జరుగుతుండగా.. రాష్ట్రంలోని మరిన్ని కాలేజీల్లో తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీంతో ఈ స్కామ్‌ను దర్యాప్తు చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆ సీబీఐ బృందంలో సీబీఐ అధికారులతోపాటు ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌, పట్వారీలు, ఇతర సిబ్బంది సభ్యులుగా ఉన్నారు. అయితే నర్సింగ్ కాలేజీల్లో తనిఖీలు చేసేందుకు వెళ్లి.. ఈ సీబీఐ టీమ్‌.. భారీగా లంచాలు తీసుకుంటున్నాయని ఆరోపణలు వచ్చాయి.


నర్సింక్ కాలేజీ కుంభకోణంలో తమ పాత్ర లేదని అనుకూలంగా తీర్పు కోసం ఆయా కాలేజీలు సీబీఐ అధికారులకు లంచాలు ముట్టజెప్పినట్లు సమాచారం అందింది. ఒక్కో కాలేజీ నుంచి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు తీసుకున్నారని వాటిని సీబీఐ అధికారులు పంచుకున్నారనే వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఆ టీమ్‌లో సభ్యులుగా ఉన్న నర్సింగ్‌ అధికారికి రూ.50 వేలు, పట్వారీలకు రూ.20 వేలు అందినట్లు విషయం బయటికి వచ్చింది. దీంతో సీబీఐ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి.. కీలక విషయాలను సేకరించారు.


ఈ క్రమంలోనే సీబీఐ టీమ్‌లో ఉన్న అధికారులపై మెరుపు దాడులు జరిపి పలువురిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అందులో సీబీఐ డిప్యూటీ ఎస్పీతోపాటు మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, మరో 22 మందిపై సీబీఐ కేసులు పెట్టింది. 8 నర్సింగ్‌ కాలేజీల డైరెక్టర్లు, ఛైర్‌పర్సన్లు, కాలేజీ సిబ్బంది, మధ్యవర్తులపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అవినీతికి పాల్పడితే ఎవర్నీ వదిలిపెట్టేది లేదనే విషయం తాజా కేసుతో రుజువవుతోందని సీబీఐ అధికార ప్రతినిధి విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa