ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు (జూన్ 4) వెలువడనున్నాయి. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు మే 13వ తేదీ ఎన్నికలు జరగ్గా.. కౌంటింగ్ రేపు నిర్వహించనున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో ఏపీలో ఎవరు గెలుస్తారు.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఒక్కో ఏజెన్సీ ఒక్కో పార్టీకి అనుకూలంగా ఇవ్వటంతో ఎవరు గెలుస్తారనే దానిపై ఏపీ ప్రజలు క్లారిటీకి రాలేకపోయారు. ఈ నేపథ్యంలో జూన్ నాలుగు కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే కౌంటింగ్ నేపథ్యంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కీలక ప్రకటన చేశారు. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగితే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఏపీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా మాచర్ల, అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ, వైసీపీ వర్గాలు దాడులు చేసుకున్నాయి. ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యి.. సిట్ ఏర్పాటు చేసేంత వరకూ పరిస్థితి వెళ్లింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు కూడా ఎన్నికల సంఘాన్ని వ్యక్తిగతంగా కలిసి వివరణ ఇచ్చుకున్నాయి. ఘటనల నేపథ్యంలో పలువురు పోలీసు అధికారులపై సైతం బదిలీ వేటు పడింది. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ సమయంలో మరోసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే
కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారని ఏపీ డీజీపీ ప్రకటనలో పేర్కొన్నారు. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని.. అలాంటి వారిని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమంటూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ఇలాంటి బెదిరింపులు, వ్యక్తిగత దూషణలకు దిగేవారిపై ఐటీయాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు,
అలాగే కౌంటింగ్ సందర్బంగా వ్యక్తిగత దూషణలు, బెదిరింపులకు దిగితే రౌడీ షీట్లు తెరవడంతో పాటుగా.. పీడీ యాక్ట్ కూడా ప్రయోగించే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో విచారణ చేస్తామనీ,వారిని కూడా ఉపేక్షించబోమని డీజీపీ హెచ్చరించారు. అలాంటి పోస్టులను, ఫోటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడం లేదా షేర్ చేయడం కూడా నిషేధమని తెలిపారు. వాట్సప్ గ్రూప్ అడ్మిన్లు అలాంటి వాటిని ప్రోత్సహించకూడదని ఏపీ డీజీపీ సూచించారు.సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవాలని హరీష్ కుమార్ గుప్తా హితవు పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa