ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రేపే ఎన్నికల కౌంటింగ్.. ఫస్ట్ రిజల్ట్ అక్కడే.. మెజారిటీ ఎవరిదో ఎన్నింటికి తేలనుందంటే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 04:24 PM

ఉత్కంఠకు తెరపడనుంది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం (జూన్ 4) వెలవడనున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నానికి ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై ఓ స్పష్టత రానుంది. జూన్‌ 4న ఉదయం 8 గంటల నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌, 8.30 నుంచి ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా పోలైన నేపథ్యంలో ఫలితాలకు కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే కౌంటింగ్ నేపథ్యంలో ఏపీకి 119 మంది అబ్జర్వర్లను ఈసీ నియమించింది.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సుమారుగా 3.33 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే 4.61 లక్షల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యాయి. 26,473 మంది ఓటర్లు హోమ్‌ ఓటింగ్‌ ద్వారా.. 26,721 మంది సర్వీసు ఓటర్లు ఎలక్ట్రానిక్‌ విధానంలో ఓటు వేశారు. మరోవైపు ఏపీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు ఏర్పాటు చేశారు. అలాగే అసెంబ్లీల సంగతికి వస్తే.. 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 33 ప్రాంతాల్లోని 401 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది.


 ఏపీ ఎన్నికల్లో తొలి, తుది ఫలితాలు ఇక్కడే..


మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ స్థానాలకు తొలుత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ రెండుచోట్ల 13 రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది. దీంతో కౌంటింగ్ ప్రారంభమైన ఐదుగంటల్లోగా వీటి ఫలితాలు వెల్లడవుతాయి. కొవ్వూరులో వైసీపీ నుంచి తలారి వెంకట్రావు, టీడీపీ కూటమి నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు బరిలో ఉన్నారు. ఇక నరసాపురం విషయానికి వస్తే వైసీపీ నుంచి ముదునూరి ప్రసాదరాజు.. జనసేన నుంచి బొమ్మిడి నాయకర్ బరిలో ఉన్నారు.


ఇక భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లు ఉన్నాయి. దీంతో వీటి ఫలితాలు వచ్చేందుకు ఆలస్యం కానుంది. మరోవైపు లోక్ సభ నియోజకవర్గాల విషయానికి వస్తే..రాజమహేంద్రవరం, నరసాపురం లోక్‌సభలో 13 రౌండ్లు ఉన్నాయి.. ఇక్కడ ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. అలాగే అమలాపురం లోక్ సభ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు 27 రౌండ్లు పడుతుంది. దీంతో ఫలితాలు వచ్చేందుకు సుమారు 9 గంటల సమయం పడుతుంది.


కౌంటింగ్ ప్రక్రియ ఇలా..


మరోవైపు ఎన్నికల ప్రక్రియలో 3 రకాల ఓట్లు ఉంటాయి. అధికారులు ముందుగా సైన్యానికి సంబంధించిన సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. సర్వీస్, పోస్టల్.. ఈ రెండు రకాల ఓట్లు తపాలా ద్వారా ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు చేరతాయి. ఉదయం 8 గంటలకు కౌటింగ్ వీటితోనే ప్రారంభం అవుతుంది. వీటి లెక్కింపు పూర్తవగానే తొలి రౌండ్‌ ఫలితం వెల్లడిస్తారు.


పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తవగానే.. నిఘా నీడలో ఉన్న స్ట్రాంగ్‌ రూముల తాళాల తీసి అక్కడి నుంచి ఈవీఎంలను కౌంటింగ్ జరిగే హాలులోకి తీసుకొస్తారు. అక్కడ నుంచి ఈవీఎంలలోని ఓట్ల కౌంటింగ్‌ మొదలవుతుంది. ఉదయం 8.50 వరకు తొలి రౌండ్‌ ఫలితం వస్తుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉండటం వల్ల ఈ రౌండ్ ఫలితానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఆ తర్వాత ప్రతి 20 నిమిషాలకు ఒక్కో రౌండ్ చొప్పున క్రమంగా ఫలితాలను వెల్లడిస్తారు.


కౌంటింగ్ కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాల ఈవీఎంలను ఈ టేబుళ్లపై వరుసగా ఉంచుతారు. అన్ని టేబుళ్ల వద్ద ఫలితాలు వచ్చాక వాటి మొత్తాన్ని తీసుకుని ఆ రౌండ్‌ ఫలితాలను అధికారులు ప్రకటిస్తారు. వాటన్నింటినీ తిరిగి స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన తర్వాత రెండో రౌండ్‌ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.నియోజకవర్గాల వారీగా ఆయా ఓట్ల వివరాలను మైక్రో అబ్జర్వర్లు, పరిశీలన అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు ధ్రువీకరించుకొని ఎన్నికల సంఘానికి వెంటనే సమాచారం అందిస్తారు.


బరిలో నిలిచిన అభ్యర్థి తరఫున ఒక ఏజెంట్‌కు కౌంటింగ్ కేంద్రంలోకి అవకాశం ఇస్తారు. పోటీ చేసే అభ్యర్థి అభ్యర్థన మేరకు కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకానికి రిటర్నింగ్‌ అధికారి అనుమతిస్తారు. ఓట్ల లెక్కింపు సిబ్బంది మినహా మిగతా వారెవరూ కౌంటింగ్ హాల్‌లోకి ప్రవేశించకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు. టేబుళ్ల వెనకవైపు ఇనుప ఫెన్సింగ్ బిగిస్తారు. టేబుల్ ఎదురుగా ఫెన్సింగ్ అవతల వేర్వేరు పార్టీల కౌంటింగ్‌ ఏజెంట్లు కూర్చొని బయట నుంచి ఫలితాలను గమనిస్తుంటారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటనలు జరిగినా.. అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకుంటారు.


మొత్తం ఎన్ని ఓట్లకుగాను, ఎన్ని ఓట్లు పోలయ్యాయనే వివరాలను కౌంటింగ్ సిబ్బంది నమోదు చేస్తారు. చివర్లో అభ్యర్థుల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో వెల్లడిస్తారు. మైక్రో అబ్జర్వర్‌, ఆర్వో, పరిశీలకుడు నిర్ధరించుకున్నాక ఆ రౌండ్‌ ఫలితాన్ని ప్రకటిస్తారు. నియోజకవర్గం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే ముందు సంబంధిత నియోజకవర్గంలోని ఏదైనా ఒక పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వీవీప్యాట్‌ను ఎంచుకొని అందులోని స్లిప్‌లను లెక్కిస్తారు. వీవీప్యాట్‌ ద్వారా వచ్చిన స్లిప్‌లు, ఈవీఎంలో పడిన ఓట్లు సరిపోలాయా లేదా నిర్ధారించుకుంటారు. వీవీప్యాట్‌ బాక్సులోని స్లిప్‌లను గుర్తుల ఆధారంగా వేరు చేస్తారు. చివర్లో ఒక్కో గుర్తుకు ఎన్ని ఓట్లు పడ్డాయో లెక్కిస్తారు. ఈ లెక్కలు ఈవీఎం ఫలితాలతో సరిపోలిన తర్వాతే చివరి రౌండ్‌ ఫలితాన్ని ఆర్వో ప్రకటిస్తారు.


తుది ఫలితాల ప్రకటనకు పట్టే సమయం సంబంధిత నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఒక రౌండ్‌లో 14 పోలింగ్‌ కేంద్రాల లెక్క తేలుతుంది. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి గరిష్ఠంగా 1,500 ఓట్లుంటాయి. వివిధ నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్‌ శాతాన్ని బట్టి ఆయా కేంద్రాల్లో 700 నుంచి 1400 వందల మంది ఓటేసి ఉంటారు. అన్ని టేబుళ్ల లెక్కింపు పూర్తైన తర్వాత ఆ రౌండ్‌ ఫలితంపై స్పష్టత వస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa