గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ఉదయం కలుసుకున్నారు. శాసనసభలో పారికర్ను కలిసిన రాహుల్, ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. మనోహర్ పారికర్ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా రాహుల్ ఆకాంక్షించారు. దీనిపై రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘గోవా సీఎం పారికర్ను కలిశాను, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నాను.. ఇది నా వ్యక్తిగత పర్యటన’ అంటూ ట్విట్టర్లో వెల్లడించారు. పారికర్తో రాహుల్ దాదాపు ఐదు నిమిషాలు భేటీ అయ్యారని, ఇరువురి మధ్యా ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని గోవా సీఎల్పీ నేత చంద్రకాంత్ కవేల్కర్ స్పష్టం చేశారు. ఇది కేవలం వ్యక్తిగత పర్యటన మాత్రమేనని, వచ్చే నెలలో రాహుల్ గోవాలో పర్యటిస్తారని తెలిపారు. శాసనసభలో ప్రతిపక్షం లాబీలోకి వెళ్లి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాహుల్ కలుసుకున్నారు. రఫేల్ ఒప్పందానికి సంబంధించిన కీలక రహస్యాలు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వద్ద ఉన్నాయంటూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన మర్నాడే ఆయనను కలవడం గమనార్హం. గోవా ఆడియో టేపులు’ నిజమైనవేననీ, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పంద రహస్యాలు మనోహర్ పారికర్కు తెలుసునని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ సోమవారం ఆరోపించారు. సంబంధిత పత్రాలు ఆయన దగ్గరే ఉన్నాయి కాబట్టి మోదీపై పైచేయి సాధించి గోవా ముఖ్యమంత్రిగా పారికర్ కొనసాగుతున్నారని పేర్కొన్నారు. ‘రఫేల్ ఒప్పందానికి సంబంధించిన దస్త్రం తన పడకగదిలో ఉందని క్యాబినెట్ భేటీలో పారికర్ అన్నారు’ అంటూ గోవా మంత్రి విశ్వజీత్ రాణె చెబుతున్న ఆడియో క్లిప్ ఇటీవల బయటకొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa