టీటీడీ పాలకమండలిగా ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే బాధ్యతలు స్వీకరించిన ఆయన.. గతంలో ఛైర్మన్లకు భిన్నంగా వ్యవహరించారు. టీటీడీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు టీటీడీ అందించే వాహనాలు, వసతి సదుపాయాలను సున్నితంగా పక్కనపెట్టారు. అలాగే ప్రమాణ స్వీకారం కోసం తిరుమలకు వచ్చిన ఆయన.. ఇక్కడ ఉన్నన్ని రోజులూ సొంత వాహనాలను వినియోగించడంతో పాటు సహచరులు, బంధువులు ఉన్న వసతి గదుల అద్దెలు, భోజనం ఖర్చులను ఆయనే భరించారు. బీఆర్ నాయుడు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది.
మరోవైపు టీటీడీ నూతన పాలకమండలి మొదటి సమావేశం ఈ నెల 18న జరగనుందని తెలుస్తోంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో బోర్డు సభ్యులు అన్నమయ్య భవనంలో సమావేశమై పలు అంశాలపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎజెండా సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. తొలిసారి జరగనున్న కొత్త బోర్డు సమావేశంలో ప్రధానంగా కొనుగోళ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి తీర్మానాలను ప్రకటించనున్నారు. తిరుమల, తిరుపతిలో భక్తుల సౌకర్యార్థం తీసుకోవాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంపై ఫోకస్ పెట్టనున్నారు. గత బోర్డు నిర్ణయాలపైనా చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడుకోవడమే ప్రస్తుత టీటీడీ ధర్మకర్తల మండలి ప్రాధాన్యత అన్నారు బీఆర్ నాయుడు. ప్రమాణస్వీకారం తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. తాను చిన్నప్పటి నుండే ప్రతి సంవత్సరం శ్రీవేంకటేశ్వర స్వామిని కాలినడకన వచ్చి దర్శించుకునేవాడినని, ప్రస్తుతం తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సేవ చేసుకునే అరుదైన అవకాశాన్ని శ్రీవారు ప్రసాదించడం పూర్వజన్మ సుకృతమన్నారు. భక్తులకు సేవ చేసేందుకు మీడియాతో సహా ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గత నెలలో బ్రహ్మోత్సవాలను ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అధికారులు సమిష్టి కృషిని కొనసాగించాలని ఆకాంక్షించారు.
తిరుమల శ్రీవారి సారె ట్రయల్ రన్
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చివరిరోజున భక్తులు విశేషంగా విచ్చేసే పంచమి తీర్థానికి తిరుమల నుండి వచ్చే శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ ఆదివారం నిర్వహించారు. తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో గల శ్రీ వినాయక స్వామివారి ఆలయం నుండి శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ మొదలైంది. అక్కడి నుండి ఏనుగుపై సారెను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ముందుగా శ్రీ కోదండరామాలయం, చిన్నబజారు వీధి, పాత హుజుర్ ఆఫీస్, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం, బండ్ల వీధి, ఆర్టిసి బస్టాండు, పద్మావతి పురం, మార్కెట్ యార్డు, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడినుండి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దగల మండపానికి సారెను వేంచేపు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa