ఆంధ్రప్రదేశ్లో ఈ నెలాఖర్లో భారీ వర్షాలు కురవనున్నాయి. నవంబర్ 27 నుంచి మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. తూర్పు హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని వున్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోందన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండంగా బలపడిన తర్వాత వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27, 28 తేదీల్లో తమిళనాడు శ్రీలంక తీరాలు వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఈ అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో నవంబర్ 27,28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మిగతాచోట్ల అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని.. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని సూచించింది. అలాగే ఉద్యానవన పంట మొక్కలు, చెట్లు పడిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో సామాన్య పౌరులకు కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు చేసింది. వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని.. జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. పొలాల్లో పనిచేసే కూలీలు, రైతులు, కాపర్లు వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని సూచించారు. భారీగా ప్రవహిస్తున్న కాలువలు, కల్వర్టుల సమీపానికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు నవంబర్ 27,28, 29వ తేదీల్లో చేపలవేటకు వెళ్లవద్దని అధికారులు కోరుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa