ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ (79: 34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లు) విధ్వంసం సృష్టించాడు. క్రీజులోకి వచ్చిన సమయం నుంచి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ ఆడాడు.సిక్సులు, ఫోర్లతో భారత్ స్కోర్ ను పరుగులు పెట్టిస్తూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అభిషేక్ శర్మ దూకుడుతో భారత్ 133 పరుగుల లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలోనే ఛేదించింది.ఈ క్రమంలోనే మైదానంలో తన పెర్ఫామెన్స్ సెలబ్రేషన్స్ ను భిన్నంగా చేసుకున్నాడు అభిషేక్. బొటనవేలు, చూపుడు వేలును పైకి చూపిస్తూ చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం అలా అభివాదం చేయడానికి కారణం కూడా తెలిపాడు. తనకు మద్దతుగా నిలిచిన కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ పై ప్రశంసలు కురిపించాడు."ఈ మ్యాచ్లో నేనేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నించా. నా కోచ్, కెప్టెన్ కోసమే అలా అభివాదం చేశాను. వాళ్లు మాకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. యువ క్రికెటర్లతో వారు మాట్లాడే తీరు అద్భుతం. ఈడెన్ గార్డెన్స్ డబుల్ ప్యాక్డ్ వికెట్. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ పిచ్పై 160 నుంచి 170 పరుగుల ఛేజ్ ఉంటుందని మేం ముందు అనుకున్నాం.మరో ఎండ్లో ఉన్న సంజు శాంసన్ తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదించాను. సింపుల్.. నా ప్లాన్. ఐపీఎల్లో నాకు బాగా ఉపయోగపడింది. జట్టులో ఇలాంటి మంచి వాతావరణం ఉండటాన్ని ఎప్పుడూ చూడలేదు. కోచ్, కెప్టెన్ వల్ల ఇంత స్వేచ్ఛగా ఆడటం ఎంతో ప్రత్యేకం. ఇంగ్లాండ్ పేస్ను ఎదుర్కోవడానికి నేనెప్పుడు సిద్ధంగానే ఉంటాను. షార్ట్ పిచ్ బాల్స్ తో వారు ఇబ్బంది పెడుతుంటారని నాకు ముందే తెలుసు" అని అభిషేక్ పేర్కొన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa