కోట్లాది మంది భారతీయ గుండెలు ఆనందంతో ఉప్పొంగుతుండగా.. ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్.. భారత గడ్డపై సగర్వంగా అడుగుపెట్టారు. శుక్రవారం (మార్చి 1) సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాత ఆయన పాక్ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. పంజాబ్లోని వాఘా-అటారీ సరిహద్దు వద్ద భారతీయుల జయజయ ధ్వానాల మధ్య భారత గడ్డపై అభినందన్ కాలుమోపారు. అభినందన్ రాక కోసం ఆయన తల్లిదండ్రులతో పాటు వేలాది మంది భారతీయులు గంటల తరబడి నిరీక్షించారు.
ఇస్లామాబాద్ నుంచి అభినందన్ను వాయు మార్గం ద్వారా లాహోర్ తరలించిన పాక్ అధికారులు.. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా అటారీ వాఘా సరిహద్దు వద్దకు తీసుకొచ్చారు. అక్కడ కొన్ని లాంఛనాలు, వైద్య పరీక్షల అనంతరం ఆయణ్ని భారత అధికారులకు అప్పగించారు. భారత వాయుసేనకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన బృందం.. అభినందన్ను రిసీవ్ చేసుకుంది. అనంతరం అక్కడే సిద్ధంగా ఉంచిన వైద్య బృందంతో ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఇండియన్ హీరోను అక్కడ నుంచి నేరుగా అమృత్సర్కు ఆ తర్వాత ఢిల్లీకి తరలించడానికి ఏర్పాట్లు చేశారు.
ఇండియన్ హీరో మాతృభూమి ఒడికి సురక్షితంగా చేరుకోవడంతో భారతీయుల గుండెలు ఆనందంతో ఉప్పొంగుతున్నాయి. ఆ అపురూప దృశ్యాలను టీవీ, కంప్యూటర్ తెరలపై వీక్షిస్తూ భారతీయులు భావోద్వేగానికి గురవుతున్నారు. అభినందన్ విడుదలవుతున్న దృశ్యాలను ప్రత్యక్షంగా చూడటానికి వేలాది మంది వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. ఆ అపురూప ఘట్టాన్ని కళ్లారా వీక్షించడానికి దేశంలోని పలుచోట్ల టీవీల ముందు ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఆయన భారత గడ్డపై అడుగుపెట్టగానే స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
శత్రు దేశ చెరలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఇండియన్ హీరో అభినందన్.. మాతృగడ్డను చేరుకున్న అపురూప ఘట్టాన్ని దేశవాసులు పండగలా నిర్వహించుకుంటున్నారు. చిన్నా, పెద్దా, కులం, మతం అనే తేడా లేకుండా జాతి అంతా ఒకేతాటిపైకి వచ్చి అభినందన్ కోసం నినదిస్తోంది. ఆయనకు ఘనంగా జేజేలు పలుకుతోంది. పాక్ నిర్భంధంలోకి వెళ్లిపోయిన 72 గంటల్లోగా విడుదలైన ఏకైక వ్యక్తి అభినందనే కావడం మరో విశేషం.
అభినందన్ విడుదల సందర్భంగా వాఘా సరిహద్దు వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. భారత్ మాతా కీ జై, వందేమాతరం, జై హింద్ నినాదాలతో సరిహద్దు దద్దరిల్లింది. భారత హీరోకు సాదర స్వాగతం పలకడానికి శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే వాఘా సరిహద్దుకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భారతీయులకు స్థానికులు మధ్యాహ్న భోజనాన్ని అందించి చేయూతనివ్వడం గమనార్హం.
భారత భూభాగంపైకి దండెత్తిన శత్రు దేశ యుద్ధ విమానాలను వెంటాడుతూ వింగ్ కమాండర్ అభినందన్ పాక్ భూభాగంలోకి వెళ్లిపోయారు. ఆ వార్త తెలిసిన నాటి నుంచి భారతీయులు తీవ్ర ఆందోళన చెందారు. అభినందన్ను తీవ్రంగా కొట్టినట్టు బయటకు వచ్చిన కొన్ని ఫొటోలను చూసి కంటతడి పెట్టారు. అభినందన్ను విడుదల చేస్తున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం మధ్యాహ్నం ఆ దేశ పార్లమెంట్లో ప్రకటించడంతో భారతీయులు ఊపిరి పీల్చుకున్నారు. అభినందన్ రాక కోసం ఆత్రుతగా ఎదురుచూశారు.
అభినందన్ రాక కోసం ప్రత్యేక పూజలు.. అభినందన్ తిరిగి భారత్లో అడుగు పెట్టనున్న సందర్భంగా తమిళనాడులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమిళనాడు పోలీసులు కాళికంబాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ప్రజలు సర్వమత ప్రార్థనలు చేశారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa