ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. మొత్తం 45 రోజుల పాటు జరిగే ఈ మహా కుంభమేళాకు 40 కోట్ల నుంచి 45 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అధికారుల అంచనాలకు మించి.. మహా కుంభమేళా ప్రారంభం అయిన 26 రోజుల్లోనే ఈ సంఖ్య 40 కోట్లు దాటింది. ఈనెల 26వ తేదీతో ముగియనున్న మహా కుంభమేళాకు మరికొన్ని కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కుంభమేళాకు వచ్చే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటే సూచనలు కనిపిస్తున్నాయని.. యూపీ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో మరిన్ని చర్యలు చేపడుతున్నారు. రోజూ కోట్ల మంది భక్తులు వచ్చి.. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
జనవరి 13వ తేదీన మహా కుంభమేళా ప్రారంభం అయింది. ఈనెల 26వ తేదీన మహా శివరాత్రి నాడు మహా కుంభమేళా ముగియనుంది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు కోట్లాది మంది భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే జనవరి 13 వ తేదీ నుంచి 26 రోజుల వరకు 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్లో స్నానాలు ఆచరించారు. ఈ మహా కుంభమేళాకు మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు. నిత్యం సరాసరి 40 లక్షల మంది త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు.
ఇంకా మహా కుంభమేళా ముగిసేందుకు 18 రోజుల సమయం ఉండగా.. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. భక్తుల రద్దీ చూస్తుంటే ఈసారి మహా కుంభమేళాలో 50 కోట్ల మందికిపైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి రికార్డు సృష్టించే అవకాశాలు ఉన్నాయని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే స్కూల్ స్టూడెంట్స్కు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని యూపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
ఇక మకర సంక్రాంతి సందర్భంగా ఒక్కరోజే 3.5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. పుష్య పూర్ణిమ నాడు 1.7 కోట్ల మంది త్రివేణి సంగమంలో స్నానం చేశారు. మరోవైపు.. జనవరి 30, ఫిబ్రవరి 1వ తేదీల్లో 2 కోట్ల మంది మహా కుంభమేళాకు చేరుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 5వ తేదీన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. అంతకుముందు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా మహా కుంభమేళాలో స్నానం ఆచరించారు. రేపు (ఫిబ్రవరి 10వ తేదీ)రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మహా కుంభమేళాకు రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa