రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ఆమె మాట్లాడుతూ.... సభలో ఉన్న మూడు పార్టీలు అధికారపక్షంగానే ఉన్నాయి. మిగిలిన నాలుగో పార్టీగా ఉన్న వైయస్ఆర్ సీపీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. దేశంలో ఎక్కడా ప్రతిపక్షం లేని రాష్ట్రం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ప్రతిపక్షం లేకుండా పాలన సాగుతోంది. గతంలో ఢిల్లీలో కేవలం ముగ్గురు బీజేపీ తరుఫున ఎమ్మెల్యేలు ఎన్నికైన నేపథ్యంలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించారు. ఏపీలో మాత్రం ఇందుకు నిరాకరిస్తున్నారంటే కూటమి పాలనలో జరుగుతున్న అక్రమాలను ప్రతిపక్షంగా ఎక్కడ సభలో నిలదీస్తారోననే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. ప్రజలు ఎంతో నమ్మి ఓట్లు వేశారు. నేడు కూటమి పాలన చూసి ఇటువంటి పార్టీలకు ఎందుకు ఓటు వేశామని బాధపడుతున్నారు. నిరుద్యోగులను, మహిళలను, విద్యార్ధులను, రైతులను మోసం చేశారు. మరోవైపు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం లేదు. అలాగే ప్రజలపై ఏకంగా రూ.15వేల కోట్ల విద్యుత్ భారం మోపారు. రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచారు. రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. మిర్చిరైతు రేటు లేక కుదేలువుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు అరవై శాతం మేర పెరిగాయి. వీటన్నింటి మీద సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తారనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. ప్రతిపక్ష హోదాపై కోర్ట్ లో వేసిన పిటీషన్ కు స్పీకర్ నుంచి కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయకపోవడం దారుణం. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం ప్రత్యేకహోదాను ఎందుకు ప్రశ్నించడలేదు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నా కేంద్రంను ఎందుకు నిలదీయలేకపోతున్నారు? గతంలో వైయస్ఆర్సీపీ చేసిన అప్పులపై అప్పురత్న అవార్డు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పుడు తొమ్మిది నెలల్లోనే ఏకంగా రూ.1.19 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన సీఎం చంద్రబాబుకు అప్పు రత్న కన్నా ఇంకా గొప్ప బిరుదు ఏం ఇవ్వాలో పవన్ కళ్యాణ్ చెప్పాలి అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa