ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుబాయ్‌లో పన్ను కట్టకుండా ఎంత గోల్డ్ తేవొచ్చు

business |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 11:48 PM

భారతీయులకు బంగారం అంటే అమితాసక్తి ఉంటుంది. ముఖ్యంగా భారతీయ మహిళలు గోల్డ్ జువెల్లరీ కొనుగోలు చేసి ధరించేందుకు ఇష్టపడుతుంటారు. పండగలు, శుభకార్యాలు, ప్రత్యేక సందర్భాల్లో అయితే కచ్చితంగా నగలు ఉండాల్సిందే. మన దేశంలో అంత డిమాండ్ ఉంటుంది. మన సంస్కృతి, సంప్రదాయాలతో అంతలా ముడిపడి ఉందని చెప్పొచ్చు. భారత్‌లో ప్రస్తుతం గోల్డ్ రేట్లు గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. హైదరాబాద్‌లోనే చూస్తే.. 22 క్యారెట్స్ గోల్డ్ రేటు ప్రస్తుతం తులం రూ. 80,500 వద్ద ఉంది. ఇదే 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే రూ. 87,820 వద్ద ఉంది. దీనిని కొనుగోలు చేసినప్పుడు.. ఆభరణాలకైతే తరుగు ఛార్జీలు, జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు వంటివి పడతాయి. ఇక 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్‌ కొనుగోలు చేస్తే.. జీఎస్టీ 3 శాతం చెల్లించాల్సిందే. అంటే ఈ ధర పైనచెప్పిన దాని కంటే ఎక్కువే ఉంటుంది.


ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. కొద్ది రోజుల కిందట దుబాయ్ నుంచి కోట్లల్లో విలువచేసే.. 14 కిలోలకుపైగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ కన్నడ నటి రన్యా రావు పట్టుబడిన సంగతి తెలిసిందే. బెంగళూరు విమానాశ్రయంలో ఆమెను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే దుబాయ్ బంగారం ధరల గురించి చర్చ మొదలైంది.


ప్రపంచ దేశాల్లో చూస్తే దుబాయ్‌లో అత్యంత స్వచ్ఛమైన బంగారం లభిస్తుందన్న వాదన ఉంది. ఇంకా.. అక్కడ బంగారం కొనుగోలు చేస్తే అదనంగా ఎలాంటి పన్నులు ఉండవు. భారత్‌లో విధించేలా దిగుమతి సుంకాలు కూడా ఉండవు. ఇంకా అక్కడ విరివిగా బంగారం లభిస్తుండటం వల్ల విక్రయాల సమయాల్లో పసిడి వర్తకుల పోటీ వల్ల కూడా ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. దీంతో.. భారత్ కంటే చౌక ధరల్లోనే అందుబాటులో ఉంటుంది. అందుకే.. చాలా మంది దుబాయ్ నుంచి సక్రమంగానో, అక్రమంగానో బంగారం పట్టుకొస్తుంటారు. దొరికితే దొంగ.. దొరక్కపోతే దర్జాగా ఉండొచ్చని ఇలా చేస్తారు. మరి అసలు దుబాయ్‌లో గోల్డ్ రేట్లు ఎలా ఉంటాయి.. అక్కడి నుంచి టాక్స్‌లతో.. టాక్స్‌లు లేకుండా ఎంత గోల్డ్ తెచ్చుకోవచ్చో తెలుసుకుందాం.


విదేశాల నుంచి భారత్‌కు గోల్డ్ దిగుమతి చేసుకుంటే దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది 6 శాతంగా ఉంది. చాలా మంది దీనిని తప్పించుకునేందుకు అక్రమంగా తరలిస్తుంటారు. దుబాయ్ నగరంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఇప్పుడు 350.50 ఏఇడీ (యూఏఇ కరెన్సీ) గా ఉంది. ఇదే భారత కరెన్సీలో చూస్తే రూ. 82 వేలకుపైగా ఉంది. అయితే భారత్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 24 క్యారెట్లపై ప్రస్తుతం రూ. 87 వేలకుపైగా ఉండగా.. జీఎస్టీ కలుపుకొని రూ. 90 వేలకుపైగానే చెల్లించాల్సి వస్తుంది.


దుబాయ్ నుంచి ఎంత గోల్డ్ తీసుకురావొచ్చు?


సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ప్రకారం.. దుబాయ్‌లో 6 నెలలకుపైగా ఉండి.. కస్టమ్స్ డ్యూటీ చెల్లించిన వారు తమ బ్యాగేజీలో కేజీ వరకు గోల్డ్ తీసుకురావొచ్చని తెలుస్తోంది. అయితే ఈ పరిమితి దాటి బంగారం తీసుకురావాలంటే.. దానిని డ్యూటబుల్ గోల్డ్ (సుంకం చెల్లించిన బంగారం) అని నిరూపించి.. చట్టబద్ధత కోసం రెడ్ ఛానెల్‌లోకి ప్రవేశించాల్సి ఉంటుంది.


కస్టమ్స్ డ్యూటీ లేకుండా ఎంత గోల్డ్ తేవొచ్చు?


అయితే కస్టమ్స్ సుంకం చెల్లించకుండా కూడా కొంత బంగారం తెచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పురుషులు, మహిళలు, పిల్లలకు కొన్ని పరిమితులు ఉన్నాయి.


ఒక పురుషుడు ధర రూ. 50 వేలకు మించని.. 20 గ్రాముల వరకు బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకురావొచ్చు. ఇది గోల్డ్ బార్లు, గోల్డ్ కాయిన్ల రూపంలో ఉండాలి. ఇక్కడ టాక్స్ చెల్లించనవసరం లేదు.


మహిళ అయితే రూ. లక్ష మించని గరిష్టంగా 40 గ్రాముల వరకు గోల్డ్ తీసుకురావొచ్చు. ఇది జువెల్లరీ, బార్లు, కాయిన్ల రూపంలో ఉండొచ్చు. ఇది వ్యక్తిగత వినియోగం కోసమై ఉండాలి.


ఇక 15 ఏళ్లలోపు పిల్లల విషయానికి వస్తే.. 40 గ్రాములకు మించకుండా గోల్డ్ తీసుకురావొచ్చు. టాక్సుల్లేకుండానే ఇక్కడ నగలు, గిఫ్ట్స్ రూపంలో తెచ్చుకోవచ్చు.


అయితే ఇక్కడ కస్టమ్స్ అఫీషియల్స్ వెరిఫికేషన్ సమయంలో.. మీరు బంగారం కొనుగోలుకు సంబంధించి పూర్తి వివరాలు చూపించాల్సి ఉంటుంది. పిల్లలకు అయితే.. వారి తల్లిదండ్రులు లేదా గార్డియెన్లతో సంబంధం గురించిన గుర్తింపు కార్డు ఉండాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa