ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హత్యకి గురైన వృద్ధురాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 29, 2025, 01:07 PM

ఏలూరు నగరంలో వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగిన సంఘటన వెలుగు వచ్చిన తర్వాత స్థానికులకు తెలియడంతో ఒక్కసారి భయబ్రాంతులకు గురయ్యారు. ఒంటరిగా ఉంటున్న చనపతి రమణమ్మ (65) చీటీల వ్యాపారం నిర్వహిస్తుంది. ఆమెను దుండ గులు తాళ్లతో కాళ్లు, చేతులు కట్టి, నోటిలో కాటన్‌ చీర కుక్కి, మెడకు నైలాన్‌తాడుతో ఉరి బిగించి హతమా ర్చారు. తరువాత పెట్రోలు పోసి నిప్పంటించేశారు. ఎలాంటి సాక్ష్యం లేకుండా చేయడానికి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు వెన్నవల్లివారిపేటలో నివాసం ఉంటున్న చనప తి రమణమ్మ (65) భర్త రాఘవరావు 20 ఏళ్ల క్రితం గుండెపోటుతో మరణించాడు. రమణమ్మ కుమార్తె రాజ్యలక్ష్మికి నవాబుపేటకు చెందిన ఎల్‌ఐసీ ఏజెంటు పెంటా శ్రీనివాసరావుతో వివాహం చేశారు. రమణమ్మ ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నారు. ఎదురుగా ఉన్న మరో రేకు షెడ్డును అద్దెకు ఇచ్చింది. గురువారం రాత్రి 10.30 గంటలకు ఇరుగు పొరుగువారితో మాట్లాడిన తర్వాత ఆమె నిద్రపోయింది. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో సమీపంలోని ఒక ఇంటి వారి కుక్క పెద్దగా మొరగడంతో రాఘవమ్మ ఇంట్లో అద్దెకు ఉంటున్న కిరణ్‌ బయటకు వచ్చి చూశాడు. రమణమ్మ ఇంటి నుంచి మంటలు, పొగ విపరీతంగా రావడం గమనించాడు. వెంటనే ఆమె అల్లుడు శ్రీనివాసరావుకు ఫోన్‌ చేసి చెప్పాడు. శ్రీనివాసరావు వచ్చిన తరువాత మంటలను కూడా ఆర్పారు. రమణమ్మ కాళ్లు, చేతులు కట్టివేయబడి, నోటిలో చీర కుక్కివేసి పెట్రోల్‌ పోసి అంటించినట్లు గుర్తించారు. మెడకు నైలాన్‌ తాడుతో ఉచ్చు బిగించారు. వెంటనే వన్‌టౌన్‌ పోలీసులకు సమా చారం ఇవ్వడంతో సీఐలు జి.సత్యనారాయణ, వైవి రమణ, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో ఇన్‌ చార్జి ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి, ఏఎస్పీ ఎన్‌ సూ ర్యచంద్రరావు, డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, సీసీఎస్‌ సీఐ రాజశేఖర్‌, మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ ఎం.సుబ్బారావు, భీమడోలు సీఐ యుజె విల్సన్‌, బృందాలు రంగంలోకి దిగాయి. ఎస్పీ సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిం చారు. క్లూస్‌ టీమ్స్‌, పోలీసు జాగిలంతో పరిశీలించారు. వృద్ధురాలి మెడలో నాన్‌తాడు, గాజులు, చెవి దిద్దులు మొత్తం పది కాసుల బంగారు ఆభరణాలు, బీరువాలోని రూ.25 వేల నగదు అపహరించినట్లు గుర్తించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అల్లుడు శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ శ్రావణ్‌కు మార్‌ తెలిపారు. ఆమె ఎవరెవరికి చీటీలు ఇచ్చారు, కట్టాల్సిన వారు ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com