దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఇటీవలే భూమి మీద సురక్షితంగా అడుగుపెట్టారు. తాజాగా నాసా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అంతరిక్షంలో అనుభవాలను వీరు పంచుకున్నారు. అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించిందనే ప్రశ్నకు సమాధానంగా చాలా అద్భుతంగా కనిపించిందని సునీత చెప్పారు. తాము హిమాలయాల మీద నుంచి వెళ్లిన ప్రతిసారి... మంచు పర్వతాల అందాలను విల్మోర్ కెమెరాలో బంధించారని సునీత తెలిపారు. హిమాలయాలు అత్యద్భుతం అని చెప్పారు. గుజరాత్, ముంబై వంటి ప్రాంతాల మీద నుంచి వెళుతున్నప్పుడు తీరం వెంబడి ఉండే మత్స్యకారుల పడవలు తమకు సిగ్నల్ మాదిరి పని చేసేవని అన్నారు. భారత్ కు వచ్చే అంశం గురించి సునీత మాట్లాడుతూ... తన తండ్రి పుట్టిన దేశానికి త్వరలోనే వెళ్లాలనుకుంటున్నానని చెప్పారు. ఇండియాలో ఉన్న బంధువులు, ప్రజలతో ముచ్చటించాలని... వారితో తన అనుభవాలను పంచుకోవాలని ఉందని అన్నారు. భారత్ ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశమని కొనియాడారు. అంతరిక్ష రంగంలో విజయాలు సాధిస్తున్న దేశాల సరసన నిలుస్తున్న దేశమని కితాబునిచ్చారు. తనలో భారత్ మూలాలు ఉండటం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.
![]() |
![]() |