ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుల్‌భూషణ్ జాదవ్‌కు అప్పీల్ చేసే హక్కు లేదు.. సుప్రీంకోర్టులో పాక్ ప్రభుత్వం వాదన

national |  Suryaa Desk  | Published : Sun, Apr 20, 2025, 11:30 PM

గూఢచర్యం ఆరోపణలతో భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను అరెస్ట్ చేసిన పాకిస్థాన్.. ఆయనకు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం భారత్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ఆయనకు అప్పీల్ చేసే హక్కును పాక్ నిరాకరించినట్టు ఆ దేశానికి చెందిన పత్రిక డాన్ కథనం నివేదించింది. కేవలం కాన్సులర్ యాక్సెస్ విషయంలో మాత్రమే తీర్పు ఇచ్చినట్టు సుప్రీంకోర్టులో పేర్కొన్నారని ఆ నివేదిక పేర్కొంది. జాదవ్ కేసులో జూన్ 2019లో భారత్‌ వేసిన పిటిషన్‌పై అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఐసీజే. దౌత్య ప్రాప్యత హక్కు ఉందని స్పష్టం చేసింది. అంతేకాదు ఆయనకు విధించిన శిక్షను పునఃసమీక్షించి, పునరాలోచించాలని పాక్‌ను ఆదేశించింది.


 ఏప్రిల్ 17న పాకిస్థాన్ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందుకు మే 9, 2023లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత దేశంలో జరిగిన అల్లర్ల ఘటనల్లో సైనిక కోర్టులు శిక్షవిధించిన పాక్ పౌరుల కేసు విచారణకు వచ్చింది. ఈ క్రమంలో ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తరఫున లాయర్ ఖ్వాజా హారిస్ అహ్మద్ వాదనలు వినిపిస్తూ.. జాదవ్ కేసును ప్రస్తావించారు. హారిస్ అహ్మద్ మాట్లాడుతూ.. ‘కుల్‌భూషణ్ జాదవ్‌కు అప్పీల్‌కు హక్కు కల్పించినప్పటికీ, మే 9 అల్లర్లలో శిక్షపడిన పాకిస్థాన్ పౌరులకు ఆ హక్కు ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు.


అయితే, పాక్ అటార్నీ జనరల్ మంసూర్ ఉస్మాన్ అవాన్ వాదనలు వినిపిస్తూ.. ఈ అంశంపై పైకోర్టుల ముందు అప్పీల్ హక్కు కల్పించాలా? వద్దా అనే అంశంపై చర్చిస్తున్నామని, దీనిపై నిర్ణయానికి రెండు రోజులు అవసరమని తెలియజేశారు. కాగా, భారత నేవీ మాజీ అధికారి జాదవ్‌ను 2016లో బలూచిస్థాన్‌లో అరెస్ట్ చేశామనీ, ఆయనపై గూఢచారి, ఉగ్రవాదం ఆరోపణలు ఉన్నాయని పాక్ చెబుతోంది.


కానీ, భారత్ మాత్రం ఈ ఆరోపణలను తిరస్కరించింది. నౌకాదళంలో పదవీ విరమణ చేసిన తర్వాత ఇరాన్‌లోని చాబహార్ పోర్టులో వ్యాపారం చేసుకుంటోన్న జాదవ్‌ను పాక్ సైనికులు అపహరించారని తెలిపింది. దీనిపై ఐసీజేకు అప్పీలు చేయగా.. భారత్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. జాదవ్‌ ఉరిశిక్షను నిలిపివేసి.. తీర్పుపై రివ్యూ పిటిషన్‌కు అనుమతించాలని జులై 2020లో పాకిస్థాన్‌ను ఆదేశించింది.


అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వచ్చి ఏళ్లు గడిచినప్పటికీ, దీనిని పాకిస్థాన్ అమలు చేయలేదని భారత్ ఆరోపించింది. ఆయనకు దౌత్యపరమైన ప్రాపత్యకు అనుమతించకుండా వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కూడా కేంద్ర ప్రభుత్వం మండిపడింది. రెండో కాన్సులర్ యాక్సెస్ తరువాత అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పును పాకిస్థాన్ ఉల్లంఘించిందని భారత్ ఆరోపించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com