జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దారుణ మారణకాండను ప్రపంచ దేశాలు సైతం ఖండిస్తున్నాయి. భారత్కు మద్దతు తెలుపుతున్నాయి. ఇక పహల్గాం ఉగ్రదాడి నేపధ్యంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇండస్ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడమే కాక.. ఆ దేశ ప్రజలను వెంటనే పాక్ వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే భారత్ చర్యలను పాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడమే కాక.. భారత్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని.. చెబుతూనే.. తాము కూడా చూస్తూ ఊరుకోమని హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉగ్రవాదులను స్వాతంత్య్ర సమరయోధులంటూ ప్రశంసలు కురిపించాడు. ఆ వివరాలు..
పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ తాజాగా ఇస్లామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ‘‘ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గాం జిల్లాలో దాడికి పాల్పడినవారు స్వాతంత్య్ర సమరయోధులై ఉంటారు’’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అంతేకాక సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై స్పందిస్తూ.. ఈ ఏకపక్ష నిర్ణయాన్ని పాకిస్థాన్ ఎప్పటికీ అంగీకరించబోదని స్పష్టం చేశాడు. దీనికి భారత్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని.. ఇందుకు ప్రతిచర్య తప్పదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదాన్ని మట్టుపెట్టేందుకు భారత్ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో పాక్తో చేసుకున్న సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక ఈ నిర్ణయం గురించి న్యూఢిల్లీ నుంచి పాకిస్థాన్కు అధికారిక సమాచారం అందించారు. ఈమేరకు భారత నీటి వనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ.. పాక్ అధికారి సయీద్ అలీ ముర్తుజాకు లేఖ పంపారు.
భారత్ పాక్కు పంపిన లేఖలో ఇలా రాసుకొచ్చింది.. ‘‘ఏ ఒప్పందాన్నైనా నిజాయతీగా గౌరవించడం అనేది ప్రాథమిక బాధ్యత. కానీ, జమ్మూకశ్మీర్ను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సాహిస్తూ కొనసాగిస్తుంది. ఈ భద్రతాపరమైన అనిశ్చితులు మా(భారత్) హక్కులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే, ఈ ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నాం’’ అని భారత్ ఆ లేఖలో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa