కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హామీ ఇచ్చారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను పార్టీ నేతలతో కలిసి శుక్రవారం ఆయన విజయవాడలోని ఆంధ్రరత్నభవన్లో విడుదల చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ను సమర్థంగా అమలు చేస్తామని చెప్పారు. చేనేత కార్మికులకు అప్పులు పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వారికి జీఎస్టీ నుంచి మినహయింపు ఇస్తామని తెలిపారు. ఉద్యోగులకు మేలు చేసేందుకు కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని (సీపీఎస్) రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇతర హామీలివే…
ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచిత సరఫరా, వికలాంగులకు రూ.3వేలు పింఛను, రజకులు, వడ్డెరలను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కృషి, వాల్మీకులు, మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కృషి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంటలకు కనీస మద్దతు ధర, రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, విద్యా హక్కు చట్టం పటిష్ఠ అమలు, ఆరోగ్య పరిరక్షణ హక్కు చట్టం, రాజీవ్ ఆరోగ్యశ్రీలో అన్ని జబ్బులు చేరుస్తాం, కార్పొరేట్ స్కూళ్లు, ఆస్పత్రుల దోపిడీ నియంత్రణ, పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి ధరల నియంత్రణ, 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వారికి రూ.2వేలు పింఛను, 60-70 ఏళ్ల వారికి రూ.2,500, 70 ఏళ్లు దాటిన వారికి రూ.3వేలు పింఛను. ఒంటరి మహిళలకు పెన్షన్. సంక్షేమ పథకాలకు బయోమెట్రిక్ విధానం తొలగింపు, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేందుకు కృషి, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ మాదిరిగా బీసీలు, మైనారిటీలకు చట్టబద్ధత కూడిన సబ్ప్లాన్ ఉంటుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa