ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు కనెక్టివిటీలో మరో ముందడుగు పడింది. విశాఖపట్నం-అబుదాబి మధ్య అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 13 (శుక్రవారం) నుంచి ప్రారంభించనున్నట్లు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రతినిధులు తెలిపారు. విశాఖపట్నం-అబుదాబి మధ్య నడిచే ఈ విమానం సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో (వారానికి నాలుగు రోజలు).. విశాఖ విమానాశ్రయం నుంచి ఉదయం 9.45 గంటలకు బయల్దేరి వెళుతుందని పేర్కొన్నారు. ఈ విమానం తిరుగు ప్రయాణంలో అబుదాబి నుంచి అదే రోజు మధ్యాహ్నం 2.35 గంటలకు బయల్దేరి విశాఖపట్నంకు చేరుకుంటుందని తెలిపారు.
అలాగే విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య విమాన సర్వీసు జూన్ 15 నుంచి ప్రారంభంకానుంది. ఈ విమానం మధ్యాహ్నం 1.55కి విశాఖపట్నం చేరుకొని తిరిగి 2.25కి భువనేశ్వరకు వెళ్తుంది అన్నారు. ఇటు జూన్ 2 నుంచి విజయవాడ-బెంగళూరు మధ్య ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సర్వీసులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరోవైపు ఇండిగో విమానయాన సంస్థ జులై 2 నుంచి విజయవాడ నుంచి కర్నూలుకు విమాన సర్వీసును ప్రారంభించనుంది. దక్షిణ భారత సేల్స్ డైరెక్టర్ సౌరభ్ సచ్దేవా ఈ విషయాన్ని తెలిపారు.
విజయవాడ నుంచి దుబాయ్, సింగపూర్లకు కూడా విమాన సర్వీసులు నడపాలని ఏపీ ఛాంబర్స్ కోరింది. గతంలో సింగపూర్కు ఇండిగో విమానాలు నడిపినప్పుడు మంచి స్పందన వచ్చిందని ఛాంబర్స్ గుర్తు చేసింది. ఈ మేరకు సౌరభ్ సచ్దేవా బృందం ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్రావుతో సమావేశమైంది. గతంలో ఇండిగో సింగపూర్కు విమానాలు నడిపినప్పుడు 80 శాతం సీట్లు నిండాయని గుర్తు చేశారు. దుబాయ్, సింగపూర్లకు విమాన సర్వీసులు చాలా అవసరమన్నారు.
ఏపీ నుంచి త్వరలో ప్రారంభంకానున్న ఈ సర్వీసుల ద్వారా ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య సంబంధాలు బలోపేతమవుతాయన్నారు పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ కొత్త విమాన సర్వీసుల ద్వారా ఏపీ రాజధాని ప్రాంతాన్ని భారతదేశంలో ప్రధాన టెక్ హబ్లలో ఒకటైన బెంగళూరుకు అనుసంధానం కావొచ్చు అన్నారు. ఇటు విశాఖ-భువనేశ్వర్ సర్వీసుతో రెండు తూర్పు తీర నగరాల మధ్య వాణిజ్య, పర్యాటక, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి దోహదపడుతుంది అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa