ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు చాలా వేగంగా డబ్బులు పొందాలంటే గోల్డ్ లోన్స్ సరైన ఎంపికగా చెప్పవచ్చు. బ్యాంకులు వేగంగా మంజూరు చేస్తుంటాయి. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. బంగారం, వెండి తాకట్టుతో మనీలాండరింగ్ చేస్తున్నారా అనేది బ్యాంకులు తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. బంగారం సొంతదేనా కాదా అనేది తెలుసుకునేందుకు రసీదులు పరిశీలించాలని, రసీదులు లేకుంటే తమ సొంత బంగారమే అని రాతపూర్వక వాంగ్మూలం తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే బంగారం తాకట్టుతో ఈజీగా లోన్స్ ఇస్తామని మోసపూరిత ప్రకటనలు చేయొద్దని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలను హెచ్చరించింది.
బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలు దుర్వినియోగం అవుతున్నట్లు, రుణాల మంజూరులో పలు బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ఆర్బీఐ. దీంతో గతంలో మాదిరిగా బంగారం రుణాలు తీసుకోవడం కుదరకపోవచ్చు. చాలా వరకు పరిమితులు విధించింది.
బంగారం కిలో, వెండి పది కిలోలు..
బంగారం తాకట్టు ఎంతైనా పెట్టొచ్చు అనుకుంటే పొరపాటే. ఇకపై ఒక వ్యక్తి పేరుపై కిలో బంగారు ఆభరణాలు మాత్రమే తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. అదే వెండి అయితే 10 కిలోల పరిమితి విధించింది ఆర్బీఐ. అలాగే బంగారం, వెండి ఆభరాణాల విలువలో ఎంత లోన్ ఇవ్వాలనే దానిపైనా పరిమితిలు విధించింది. రూ.2.50 లక్షల లోపు లోన్ కావాలనుకుంటే తాకట్టు పెట్టే బంగారం విలువలో 85 శాతం ఇస్తారు. అదే రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అయితే బంగారం విలువ 80 శాతం లోన్ ఇస్తారు. ఇక 5 లక్షలు మించి లోన్ కావాలనుకుంటే బంగారం విలువలో 75 శాతం మాత్రమే బ్యాంకులు మంజూరు చేస్తాయి.
బంగారం నాణేలు, బిస్కెట్లు తాకట్టు పెట్టాలంటే 50 గ్రాములు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక వెండి 250 గ్రాములు మాత్రమే తాకట్టు అనుమతిస్తారు. ఒకేసారి వివిధ బ్యాంకుల్లో గోల్డ్ లోన్స్ తీసుకున్నట్లు తెలిస్తే వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. అలాగే లోన్ నేరుగా రుణ గ్రహీత బ్యాంక్ అకౌంట్లోనే జమ చేయాలని స్పష్టం చేసింది. లోన్ తీసుకున్న ఏడాదిలోపు తిరిగి చెల్లించాలి. లేదంటే తాకట్టు పెట్టిన సొమ్మును వేలం వేసి రికవరీ చేయాలని తెలిపింది. వేలం ప్రక్రియ రెండు సార్లు చేపట్టాలని మొదట బ్యాంకు ఉన్న జిల్లా పరిధిలో చేపట్టాలని, ఆ తర్వాత ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని కోరింది. ఇక లోన్ చెల్లించి రెండేళ్లలోగా బంగారం తీసుకోకపోతే పాలకమండలికి తెలియజేయాలి. లోన్ తీసుకున్న వ్యక్తి వారసులను గుర్తించి వారికి సమాచారం ఇవ్వాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa