ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అమరావితి అంతర్జాతీయ స్థా్యి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. అమరావతిలో మౌలిక వసతుల ప్రాజెక్టులకు పెద్ద పీట వేస్తోంది. అమరావతిని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అలాగే స్పోర్ట్స్ సిటీ, అమరావతిలోక్రికెట్ స్టేడియం వంటి నిర్మాణాలను చేపట్టనుంది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. అమరావతి కోసం అదనంగా భూమిని సమీకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి అదనపు భూసమీకరణకు ఏపీ కేబినెట్ కూడా మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక విషయాలు వెల్లడించారు. అమరావతిలో అదనపు భూ సమీకరణకు జులై నెలాఖరులో సీఆర్డీఏ నోటిఫికేషన్ ఇస్తుందని మంత్రి నారాయణ వెల్లడించారు. అలాగే అదనపు భూ సమీకరణకు 2015 నాటి నిబంధనలే అమలు చేయనున్నట్లు తెలిపారు. దీనికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అమరావతిలో 5000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించనున్నారు. అలాగే 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, మరో 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం 10 వేల ఎకరాలు అవసరమవుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు.
మరోవైపు అమరావతి భవిష్యత్తు అవసరాల కోసం అదనంగా 45 వేల ఎకరాలు సమీకరించనున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటుందన్న ఆయన.. ఈ నేపథ్యంలో ఎక్కువ భూమి అవసరమవుతోందన్నారు. మరోవైపు అమరావతిలో అనేక సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తోంది.
రాజధాని అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో పలు కంపెనీలకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అమరావతిలో భూములు కేటాయిస్తోంది. ఇప్పటి వరకూ సుమారుగా 74 సంస్థలకు అమరావతిలో భూములు కేటాయించారు. మూడేళ్లలోగా అమరావతి నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa