ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిరాజ్ లాంటి బౌలర్ ఉంటే కెప్టెన్సీ చాలా తేలిక అన్న శుభ్‌మన్ గిల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 04, 2025, 09:16 PM

మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లు జట్టులో ఉంటే కెప్టెన్సీ చాలా సులువుగా అనిపిస్తుందని భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసలు కురిపించాడు. టీమిండియా-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ 2-2తో హోరాహోరీగా ముగిసిన అనంతరం గిల్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్న గిల్ మాట్లాడుతూ బౌలర్ల అద్భుత ప్రదర్శనే జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిందని స్పష్టం చేశాడు.ఈ సిరీస్ గెలుపుపై గిల్ మాట్లాడుతూ, “సిరాజ్, ప్రసిద్ధ్ బంతికి ప్రాణం పోశారు. వాళ్లు అంత అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు మాపై ఒత్తిడి ఉన్నా గెలుస్తామనే నమ్మకం కలిగింది. ముఖ్యంగా సిరాజ్ ఒక కెప్టెన్‌కు దొరికిన డ్రీమ్ బౌలర్ లాంటివాడు. ప్రతి బంతిని, ప్రతి స్పెల్‌ను జట్టు కోసమే వేశాడు. తన సర్వశక్తులు జట్టుకోసం ధారపోశాడు” అని కొనియాడాడు. రెండు జట్లూ అద్భుతంగా పోరాడాయని, ఐదో రోజు వరకు ఫలితం తేలకపోవడమే సిరీస్ ఎంత తీవ్రంగా సాగిందో చెబుతోందని అన్నాడు.తన వ్యక్తిగత ప్రదర్శనపై కూడా గిల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. “ఒక బ్యాటర్‌గా నా ఆటలో కొన్ని అంశాలను మెరుగుపరుచుకోవాలనుకున్నాను. ఈ సిరీస్‌లో ఉత్తమ బ్యాటర్‌గా నిలవాలనేది నా లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆటలో టెక్నిక్‌తో పాటు మానసిక దృఢత్వం కూడా ఎంతో ముఖ్యం. మానసికంగా బాగున్నప్పుడు, టెక్నిక్ కూడా దానంతట అదే కుదురుతుంది” అని వివరించాడు.ఈ సిరీస్ తనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిందని గిల్ పేర్కొన్నాడు. “పరిస్థితులు ఎలా ఉన్నా ఎప్పటికీ పోరాటం వదిలిపెట్టకూడదు అనే విషయాన్ని ఈ సిరీస్ ద్వారా నేర్చుకున్నాను” అని ముగించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa