ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీనియర్లు లేని టీమ్.. కానీ ఆట మాత్రం ఫుల్ ఫైట్!

sports |  Suryaa Desk  | Published : Mon, Aug 04, 2025, 09:35 PM

ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు చాలా మంది సందేహంతో ఉన్నారు — "సీనియర్లు లేని జట్టు ఏమి చేస్తుంది?" అని. అయితే పాత, కొత్త ఆటగాళ్ల సమ్మిళితంతో ఏర్పడిన భారత జట్టు అంచనాలను తలకిందులు చేస్తూ ఇంగ్లాండ్ గడ్డపై అదిరిపోయే ప్రదర్శన కనబర్చింది. దాదాపు ప్రతి మ్యాచ్‌లో భారత జట్టే ఎక్కువసేపు ఆధిక్యంలో ఉండగా, కొన్ని చిన్న తప్పిదాల కారణంగా రెండు మ్యాచ్‌లు చేజారాయి. కానీ చివరి టెస్టులో కీలక ఆటగాళ్లు పంత్, బుమ్రా లేని సందర్భంలోనూ, సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో భారత్ ఆరు పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-2తో సమంగా ముగించింది. ఈ విజయంలో సమష్టి కృషి ఎంతో కీలకంగా నిలిచింది.ఈ సమయంలో యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన నాయకత్వ ప్రతిభను చాటేశాడు. లార్డ్స్‌ను మినహాయిస్తే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో గిల్ బ్యాట్‌తో మెరిపించాడు. ముఖ్యంగా ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో డబుల్ సెంచరీ చేసి ఆ మైదానంలో భారత్‌కు చారిత్రక విజయం అందించాడు. మొత్తం సిరీస్‌లో గిల్ 754 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచి "ప్లేయర్ ఆఫ్ ది సిరీస్" అవార్డును అందుకున్నాడు. కేఎల్ రాహుల్ నిలకడగా 500కుపైగా పరుగులు చేయగా, వయసు మీద పడుతున్నా రవీంద్ర జడేజా మిడ్‌ల ఆర్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో 516 పరుగులతో పాటు 7 వికెట్లు తీసి జట్టుకు రెండు వైపులా మద్దతుగా నిలిచాడు.మాంచెస్టర్ టెస్టులో జడేజా మరియు వాషింగ్టన్ సుందర్ శతకాలు చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించారు. బుమ్రా ఫిట్‌నెస్ సమస్యలతో కేవలం మూడు టెస్టులకే పరిమితమవగా, ఆ మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు తీశాడు. మిగిలిన టెస్టుల్లో సిరాజ్ పేస్ దళానికి నాయకత్వం వహిస్తూ లీడ్ చేశాడు. ఈ హైదరాబాదీ పేసర్ మొత్తం 185.3 ఓవర్లు వేసి, 23 వికెట్లు తీసి సిరీస్‌లో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. లార్డ్స్, ఓవల్ టెస్టుల్లో ఐదు వికెట్ల ఘనత కూడా సాధించాడు.ప్రసిద్ధ్ కృష్ణ (14 వికెట్లు), ఆకాశ్ దీప్ (13 వికెట్లు) తాము గెలుపులో పాత్ర పోషించారు. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టు మాత్రం భారత్‌కు చేజారిన మ్యాచ్‌లలో ముఖ్యమైంది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 22 పరుగుల తేడాతో ఓడింది. జడేజా అద్భుతంగా పోరాడినప్పటికీ, చివర్లో సిరాజ్ ఔటవడంతో గెలుపు దూరంగా మిగిలిపోయింది. అదే మ్యాచ్ గెలిచి ఉంటే ఈ సిరీస్ ఫలితం పూర్తిగా భారత్ వైపే వుండేదన్నది తథ్యం!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa