ఆంధ్రప్రదేశ్వ్యాప్తంగా పలుచోట్ల అంగన్వాడీలు ఫోన్లు తిరిగి ఇచ్చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఫోన్లు మాకొద్దు బాబోయ్ అంటున్నారు. చిత్తూరు ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు సోమవారం నిరసన చేపట్టారు. తమకు 5జీ ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.క్షేత్రస్థాయిలో నెట్వర్క్, సిగ్నల్స్ సమస్య ఉందని.. ఈ ఫోన్లతో పనిచేయలేకపోతున్నామని వాపోయారు. ఒకే యాప్లో వివరాలు అప్లోడ్ చేసేలా కొత్త యాప్ తేవాలంటూ.. తమ వద్ద ఉన్న పాత సెల్ఫోన్లను సీడీపీవో కార్యాలయంలో తిరిగి ఇచ్చేశారు. అయితే సెల్ఫోన్లు ఎందుకు తిరిగి ఇచ్చేస్తున్నారు.. వారి డిమాండ్లు ఏంటనే సంగతికి వస్తే.. 2018లో ప్రభుత్వం ఈ ఫోన్లను అంగన్వాడీలకు పంపిణీ చేసింది.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతల కోసం ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకాలు, లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు వీలుగా ఈ ఫోన్లను అందించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు అందించే రేషన్ వివరాలను ఈ ఫోన్లను ఉపయోగించి పోషణ ట్రాకర్, బాల సంజీవని యాప్ల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే తొలినాళ్లల్లో మంచిగానే పనిచేసిన ఈ ఫోన్లు.. గత కొద్దికాలంగా మొరాయిస్తున్నాయని అంగన్వాడీలు వాపోతున్నారు. నెట్వర్క్, సిగ్నల్స్ సమస్య కారణంగా ప్రభుత్వం అందించిన ఫోన్లు సరిగా పనిచేయడం లేదని చెప్తున్నారు. అలాగే యాప్ల భారం పెరిగిపోయిందని చెప్తున్నారు. ఈ విషయం మీద అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని చెప్తున్నారు.
మరోవైపు అంగన్వాడీ కేంద్రాలలో రేషన్ పొందే లబ్ధిదారులు, లేదా వారి కుటుంబసభ్యులు ఎవరు వచ్చినా కూడా గతంలో రేషన్ అందించేవారు. అయితే ఇప్పుడు లబ్ధిదారులకు మాత్రమే ఫోటో తీసి ఇవ్వాల్సి ఉంటుంది. గర్భిణులుగా ఉన్న మహిళలు ప్రసవం తర్వాత అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పరిస్థితి ఉండదని.. అలాంటి వారికి ఇళ్లవద్దకే వెళ్లి అందించాలని.. దీంతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై దృష్టి పెట్టలేకపోతున్నామనేది అంగన్వాడీలు చెప్పే మరో కారణం.
దీనికి తోడు ఆరోగ్యశాఖ కింద ఉన్న ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కార్యక్రమం అమలు కూడా తాజాగా అంగన్వాడీలకే అప్పగించారు. దీంతో మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయంటూ.. తమకు ఇచ్చిన ఫోన్లను తిరిగి ఇచ్చేస్తామని అంగన్వాడీలు స్పష్టం చేస్తున్నారు. కొత్త 5జీ ఫోన్లు ఇవ్వాలని.. అన్ని యాప్లను కలిపి ఒకే యాప్ కిందకు తేవాలని.. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa