ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని.. మరో 24 గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వాయుగుండం ఆగస్ట్ 19వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరప్రాంతం మధ్యన తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. విశాఖపట్నం. అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా , కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు విశాఖ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, అల్లూరి జిల్లా , ఏలూరు, కృష్ణా జిల్లా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వైఎస్సార్ కడప జిల్లా. కర్నూలు, అనంతపురం, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు విశాఖ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు
మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ వాయుగుండం మంగళవారం మధ్యాహ్నం నాటికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.
మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం రోజున శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా , విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. రాష్ట్రంలని .మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
భారీ వర్షాలు కురిసే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని.. అలాగే పాడుబడిన భవంతులు, భవనాలకు సమీపంలో ఉండొద్దని సూచించింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలకూ దూరంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa