ఏపీకి రాజధాని ఏంటి అంటే.. ఒక్కొక్కరూ ఒక్కో రకమైన సమాధానం చెబుతారు. కొందరు అమరావతి అని చెబితే.. మరికొందరు మాత్రం విశాఖ, కర్నూలు, అమరావతి అంటారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రానికి కొత్త రాజధాని అమరావతి అని పేర్కొన్నారు. కానీ 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి శాసన రాజధానిగా.. విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా.. కర్నూలును న్యాయ రాజధానిగా చేయడం వల్ల.. అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని.. వైసీపీ వాదిస్తూ వస్తోంది. ఇక గతేడాది జరిగిన 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి రావడంతో.. మళ్లీ అమరావతినే ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలని తేల్చి చెప్పింది.
ఈ క్రమంలోనే తాజాగా విశాఖలో పర్యటించిన మంత్రి నారా లోకేష్.. ఏపీ రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్కు ఒకే రాజధాని ఉంటుందని.. కాకపోతే అభివృద్ధిని మాత్రం వికేంద్రీకరణ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పారు. విశాఖ కన్వెన్షన్లో ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న నారా లోకేష్.. రోజురోజుకూ పెరుగుతున్న టెక్నాలజీ, దాని వల్ల ఉన్న ఉద్యోగాలు పోవడం, కొత్త ఉద్యోగాలు రావడం గురించి మాట్లాడారు.
పారిశ్రామిక విప్లవం వచ్చిన ప్రతీసారి.. ఉద్యోగాలు తగ్గుతాయని అందరూ అంటారని.. కానీ కొత్త ఉద్యోగాల సృష్టి పెరుగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం మనందరి ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒక గొప్ప అవకాశంగా ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై దృష్టి సారించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కాబోతుందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ యువత భారతదేశానికి మాత్రమే కాకుండా.. ప్రపంచానికే సేవలు అందించాలని నారా లోకేష్ ఆకాంక్షించారు. 2047 కల్లా ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు. మన దేశంలో తయారు చేస్తున్న ఏసీల్లో సగం.. ఏపీలోనే ఉత్పత్తి అవుతున్నాయని గుర్తు చేశారు.
కంప్రెస్ బయోగ్యాస్ క్యాపిటల్గా ప్రకాశం జిల్లాను తయారు చేస్తామని నారా లోకేష్ వెల్లడించారు. ఇక అనంతపురం జిల్లాను.. ఆటోమోటివ్ క్యాపిటల్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. కర్నూలు జిల్లాను పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో క్యాపిటల్గా మారుస్తామని.. కడప, చిత్తూరు జిల్లాల్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa