ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. ఇక ఢిల్లీ , గురుగావ్ వంటి ప్రాంతాలు అయితే పూర్తిగా నీట ముగినిపోయాయి. రెండు రోజుల క్రితం గురుగావ్లో 20 కిమీ మేర ట్రాఫిక్ నిలిచిపోయిందంటే.. వర్ష బీభత్సం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వాన కురుస్తోంది. భారీ వర్షాలు, వరదల వల్ల రోడ్లన్ని జలమయం అయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. ఇక బుధవారం ఢిల్లీ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు సఫ్తర్జంగ్, కశ్మీర్గేట్, ఇండియాగేట్, కన్నాట్ ప్లేస్ సహా అనేక ప్రాంతాలు నీట మునిగి.. నగరం పూర్తిగా స్తంభించిపోయింది.
ఇదిలా ఉంటే ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల రాజధానికి ఆనుకుని ఉన్న యమునా నదిలో రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. సుమారు 63 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో వరద నీరు వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. హత్నికుండ్ బ్యారేజ్ నుంచి భారీగా నీటిని వదలడంతో.. యుమునలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. బుధవారం అనగా సెప్టెంబర్ 3 రాత్రి పది గంటల ప్రాతంలో యమునలో నీటిమట్టం 207.43 మీటర్లకు పెరిగింది. 63 సంవత్సరాల తర్వాత అంటే 1963 తర్వాత యమునా నదిలో నీటి మట్టం ఈ స్థాయికి చేరడం ఇది మూడో సారి అంటున్నారు.
భారీ వర్షాలు, వరదల వల్ల దేశ రాజధాని నగరం ఢిల్లీలోని రింగ్ రోడ్డు, సివిల్ లైన్స్ సహా అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ వర్షాల వల్ల ఢిల్లీ వ్యాప్తంగా సుమారు 12 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. వరదల వల్ల మజ్ను కాటిల్లా, సలీంగర్ బైపాస్ మార్గాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడి జనాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం కురుస్తోన్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని.. గీతా కాలనీ, నిగంబోధ్ ఘాట్ ప్రాంతాల్లో దహన సంస్కారాలను నిలిపివేశారు.
వరద పరిస్థితులను పర్యవేక్షిస్తున్న నోడల్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదల ముప్పు నుంచి సుమారు 12 వేల మందిని మందిని కాపాడమని తెలిపారు. అలానే వర్షం వల్ల నిరాశ్రయులైన బాధితుల కోసం 38 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఎగువన యమునా నది పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. హత్నికుండ్ బ్యారేజ్ నుంచి బుధవారం రాత్రి 7 గంటలకు 1.78 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాధారణంగా ఈ బ్యారేజ్ నుండి 50 వేల క్యూసెక్కుల కంటే తక్కువ నీరు మాత్రమే విడుదల అవుతుంటుంది. కానీ ఈసారి అది రెండింతలు పెరిగింది. ఇలానే భారీ వర్షాలు కొనసాగితే ఢిల్లీకి ముప్పు తప్పదని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa