ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేపాల్ లో ప్రజాప్రతినిధుల ఇళ్లపై సైతం దాడికి పాల్పడిన ప్రజలు

international |  Suryaa Desk  | Published : Thu, Sep 11, 2025, 01:10 PM

నేపాల్‌లో అరాచకం చెలరేగింది. రాజధాని ఖాట్మండు హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు సైన్యం రంగంలోకి దిగింది. కర్ఫ్యూ విధించడంతో ఖాట్మండు వీధుల్లో సైనికులను మోహరించారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో మొదలైన నిరసనలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా ‘జనరేషన్ Z’గా పిలుచుకుంటున్న యువత వేలాదిగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. మంగళవారం నాడు ఆందోళనకారులు ఏకంగా పార్లమెంట్ భవనానికే నిప్పు పెట్టారు. పలువురు మంత్రులు, ప్రభుత్వ అధికారుల ఇళ్లపై దాడులు చేసి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సమాచార శాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ ఇంటిని తగలబెట్టారు. ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్‌ను వీధిలో వెంబడించి దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా, ఆయన భార్య, విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్ బాపై వారి నివాసంలోనే మూకదాడి జరిగింది. ఈ దాడిలో గాయపడిన దేవ్ బా, ముఖంపై రక్తంతో నిస్సహాయంగా ఒక పొలంలో కూర్చున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి. పరిస్థితి విషమించడంతో సైన్యం రంగంలోకి దిగి హెలికాప్టర్ల ద్వారా మంత్రులను, వారి కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కొందరు మంత్రులు రెస్క్యూ బాస్కెట్‌ను పట్టుకుని వేలాడుతూ హెలికాప్టర్‌లో వెళ్తున్న దృశ్యాలు అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa