ఏపీలో సంచలనం రేపిన తుని మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో నిందితుడు నారాయణరావు ఆత్మహత్య కలకలం రేపుతోంది. నారాయణరావు వాష్రూమ్ కోసమని చెప్పి కారు ఆపి చెరువులో దూకినట్లు పోలీసులు చెబుతున్నారు. అతడి మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీశారు. అయితే ఈ కేసులో నిందితుడు నారాయణరావు కుమారుడు సురేష్ తీరుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇవాళ ఉదయం సురేష్ ఫేస్బుక్ వేదికగా పెట్టిన పోస్ట్.. నారాయణరావు మరణం తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్ అయ్యాయి.
నారాయణరావు కుమారుడు సురేష్ ఇవాళ ఉదయం ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. 'నా దృష్టిలో ఎప్పుడో పోయాడు' అంటూ తండ్రి ఫోటోతో సంతాపం తెలుపుతున్నట్లుగా ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ కింద మీరు గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. అయితే కొద్దిసేపటికే నారాయణరావు చనిపోయాడని తెలిసింది. వెంటనే సురేష్ స్పాట్కు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు.
ఘటన జరిగిన దగ్గర.. తన తండ్రి నారాయణరావు మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని సురేష్ చెబుతున్నారు. ఆయనది ఆత్మహత్య కాదని.. కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. తన తండ్రిని కావాలనే ఇలా చేశారని.. పోలీసులు చెబుతున్న విషయాలపై అనుమానం ఉందన్నారు. చెరువులో పడిన వెంటనే తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. బుధవారం రాత్రి 10:30 కి తమ ఇంటికి వచ్చి తండ్రి రిమాండ్ కోసం సంతకాలు పెట్టించుకున్నారని సురేష్ అంటున్నారు. అప్పుడే తమ తండ్రి చెరువులోకి దూకేశాడని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రాత్రి దూకేస్తే ఉదయం వరకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని.. తుని రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి మార్గ మద్యలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఉదయం సురేష్ పెట్టిన ఫేస్బుక్ పోస్ట్.. ఆ తర్వాత తన తండ్రి మరణంపై అనుమానాలు వ్యక్తం చేయడంపై కొందరు సోషల్ మీడియాలో స్పందించారు.
పోలీసులు వాదన మరోలా ఉంది. నారాయణరావును బుధవారం సాయంత్రం 6 గంటలకు అరెస్ట్ చేశామన్నారు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు. రాత్రి 10.30 మెజిస్ట్రేట్ ముందు హజరుపరిచేందుకు తుని రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి నారాయణరావును తీసుకెళ్లినట్లు తెలిపారు. అదే సమయంలో మార్గమద్యలో ఉన్న కోమటి చెరువు దగ్గర వాష్రూమ్కు వెళ్లాలని నారాయణరావు కారు ఆపినట్లు చెప్పుకొచ్చారు. అలా కారు ది చెరువు దగ్గరకు వెళ్లి దూకేశాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో వర్షం పడుతుండటంతో కానిస్టేబుళ్లు దూరంగా ఉన్నట్లు డీఎస్పీ చెప్పుకొచ్చారు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చామని.. రాత్రి సమయం వల్ల గాలింపు చర్యలు చేపట్టలేదన్నారు. ఉదయం గజ ఈతగాళ్లతో గాలించగా మృతదేహం దొరికిందన్నారు.
తునిలో మైనర్బాలికపై అత్యాచారయత్నం కేసు నిందితుడు నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో నారాయణరావును అరెస్టు చేసిన పోలీసులు వైద్యపరీక్షలు అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తీసుకెళుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి కోర్టుకు తరలిస్తున్న సమయంలో వాష్రూమ్కు వెళ్లాలని నారాయణరావు పోలీసులకు చెప్పాడు. దాంతో వారు తుని పట్టణ శివారులోని కోమటిచెరువు పక్కన వాహనాన్ని ఆపారు. అప్పుడే వర్షం ప్రారంభం కావడంతో పోలీసులు చెట్టు కిందకు వెళ్లారు. ఈ సమయంలోనే నారాయణరావు ఒక్కసారిగా చెరువులో దూకేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రాత్రంతా ఆయన కోసం వెతికారు.. కానీ, లైటింగ్ సమస్య వల్ల అతడి ఆచూకీ లభించలేదు. దీంతో ఉదయాన్నే ఫైర్, పోలీస్ సిబ్బంది గజ ఈతగాళ్లతో సెర్చ్ చేయగా.. నారాయణరావు మృతదేహం లభించింది. ప్రస్తుతం నారాయణరావు మృతదేహాన్ని తుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa